దెయ్యం భయంతో ఇళ్లు ఖాళీ

ABN , First Publish Date - 2021-02-25T08:42:18+05:30 IST

ఐదు మాసాల వ్యవధిలో ఆ కాలనీకి చెందిన ముగ్గురు యువకులు వివిధ కారణాలతో చనిపోయారు.

దెయ్యం భయంతో ఇళ్లు ఖాళీ

  • మరణాలతో భీతిల్లిన ప్రజలు
  • కాలనీ విడిచిన 40 కుటుంబాలు  
  • మరో చోట తాత్కాలిక నివాసాలు 

తరిగొప్పుల, ఫిబ్రవరి 24: ఐదు మాసాల వ్యవధిలో ఆ కాలనీకి చెందిన ముగ్గురు యువకులు వివిధ కారణాలతో చనిపోయారు. అయితే వారంతా గురువారాల్లోనే మృతి చెందడంతో కాలనీ వాసులంతా ఓ మహిళ చేతబడితో సృష్టించిన దెయ్యమే దీనికి కారణమన్న మూఢ విశ్వాసంలో మునిగిపోయారు. రాత్రయితే చాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్న వారంతా కాలనీ విడిచి పారిపోయారు. మనిషింటూ కనిపించని ఆ కాలనీలో ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.  జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామంలో బేడ బుడగ జంగాల కాలనీకి చెందిన అన్నదమ్ములైన చింతల భాను, బాలరాజు గతేడాది అక్టోబరులో అమావాస్యకు ముందు మొదటి గురువారం ఒకరు, రెండో గురువారం మరొకరు మరణించారు. దీనికి తోడు ఇటీవల అదే కాలనీకి చెందిన గంథం రాజు అమావాస్యకు ముందు గురువారం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. వాస్తవానికి మొదటి ఇద్దరిలో ఒకరు మూర్ఛవ్యాధితో మృతిచెందగా మరొకరు అనారోగ్యంతో మృతిచెందారు. కాని, పోతారం గ్రామానికి చెందిన ఓ మహిళ చేతబడితో సృష్టించిన దెయ్యం కాలనీలోని ఓ పాత బంగ్లాలో ఉంటూ రాత్రిళ్లు నెత్తిన బోనం ఎత్తుకుని నగ్నంగా తిరుగుతోందని వదంతులు మొదలయ్యాయి. దెయ్యం నీడపడినందుకే ఆ ముగ్గురు యువకులు మృతి చెందారని, ఇక్కడే ఉంటే ఆ దెయ్యం అందరినీ చంపేస్తుందన్న భయంతో ఒక్కొక్కరుగా మొత్తం 40 కుటుంబాలు వలసబాట పట్టడంతో కాలనీ మొత్తం ఖాళీ అయింది. వీరంతా తరిగొప్పులలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. 

Updated Date - 2021-02-25T08:42:18+05:30 IST