మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటేది?

ABN , First Publish Date - 2020-05-30T09:53:12+05:30 IST

రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఆందోళన ప్రారంభమైంది

మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటేది?

ఏలూరు క్రైం/జంగారెడ్డిగూడెం/భీమవరం క్రైం/నరసాపురం/కొవ్వూరు, మే 29: రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఆందోళన ప్రారంభమైంది. నాలుగు నెలల్లో కమిషన్‌ ఏర్పాటు చేయాలని అక్టోబరు నెలలో హైకోర్టు ప్రభుత్వా న్ని ఆదేశించింది. ఇప్పటి వరకు కమిషన్‌ ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలో పౌర హక్కుల సంఘాలు, లాయర్లు, ప్రజాసంఘాలు జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఆందో ళన చేపట్టాయి. హైకోర్టు ఆదేశాల మేరకు మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటు చేయాలని జిల్లా బార్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు, ఏలూరు బార్‌ అధ్యక్షుడైన అబ్బినేని విజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఏలూరులో బార్‌ అసోసియేషన్‌, పౌరహక్కుల సంఘం, ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ లిబర్టీసీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. జంగారెడ్డిగూడెంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.రామ్మో హన్‌ ఆధ్వర్యంలో న్యూడెమోక్రసీ కార్యాలయంలో నిరసన చేపట్టారు.


రాష్ట్రంలో నాలుగేళ్లుగా మానవ హక్కుల కమిషన్‌ పనిచేయడం లేదని ఐఏఎల్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి చెల్లబోయిన రంగారావు భీమవరంలో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కోర్టు తీర్పుతో నాలుగు నెలల్లో ఏర్పాటు చేస్తామని ఇప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చి కూడా ఏర్పాటు చేయలేదన్నారు. భీమవరం బార్‌ అసోసియేన్‌ హాల్‌లో ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్‌ న్యాయవాదులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. నరసాపురంలో శుక్రవారం ఐఏఎల్‌ రాష్ట్ర కౌన్సిల్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. మానవ హక్కుల కమిషన్‌ ఏర్పాటు చేయడంలో అధికార, ప్రతిపక్షాలు విఫలం అయ్యాయని పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకుడు నంబూరి శ్రీమన్నారాయణ విమర్శించారు. కొవ్వూరు పట్టణంలో పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. 

Updated Date - 2020-05-30T09:53:12+05:30 IST