కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు
ABN , First Publish Date - 2021-10-23T08:17:35+05:30 IST
సీఎం కేసీఆర్ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించారని, అందులో 8ు కమీషన్ దండుకున్నారని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో భాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట..
- ఎన్నికల్లో అబద్ధాలు చెప్పడం కేసీఆర్కు అలవాటే: ఉత్తమ్
ఇల్లందకుంట/హుజూరాబాద్/హైదరాబాద్, అక్టోబరు 22: సీఎం కేసీఆర్ కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించారని, అందులో 8ు కమీషన్ దండుకున్నారని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో భాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ తరఫున ప్రచారం నిర్వహించారు. ఏడున్నర ఏళ్లు మంత్రిగా దళితుల, దేవాలయ భూములు ఆక్రమించిన ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచినా సాధించేది ఏమీ లేదన్నారు. యువకుడు, విద్యావంతుడైన వెంకట్ను గెలిపిస్తే అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుకగా నిలుస్తాడన్నారు.
దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి: వీహెచ్
దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. కేసీఆర్, ఈటల మధ్య లొల్లే హుజూరాబాద్ ఉప ఎన్నిక అన్నారు.
ఈటల అవినీతిలో టీఆర్ఎస్కూ భాగస్వామ్యం: మహేశ్గౌడ్
దేశంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లాంటి ఖరీదైన ఎన్నికలు ఎన్నడూ చూడలేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నాయన్నారు. మంత్రిగా ఈటల రాజేందర్ పాల్పడిన అవినీతిలో టీఆర్ఎ్సకూ భాగస్వామ్యం ఉందన్నారు.
వ్యాక్సినేషన్ ఎందుకు పూర్తి చేయలేదు: పొన్నాల
కొవిడ్ టీకాలు దేశంలోనే ఉత్పత్తి అవుతున్నా వ్యాక్సినేషన్ను ఎందుకు పూర్తి చేయలేక పోయారని ప్రధాని మోదీని టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. 106 దేశాల్లో టీకాల ఉత్పత్తి లేకున్నా వ్యాక్సినేషన్ను పూర్తి చేశాయని గుర్తు చేశారు.