అన్నను అంతమొందించడానికి.. పక్కా ప్లాన్తో.. యువతిని ఎరవేసి..
ABN , First Publish Date - 2020-06-30T10:14:39+05:30 IST
అదృశ్యం కేసును పోలీసులు చేధించి..
యువతిని ఎరవేసి వ్యక్తి హత్య
భూమి సరిహద్దు వివాదమే కారణం
నిందితుల అరెస్టు
ముమ్మిడివరం(తూర్పు గోదావరి): అదృశ్యం కేసును పోలీసులు చేధించి హత్యగా నిర్థారించారు. స్థానిక పోలీస్స్టేషన్లో సోమవారం డీఎస్పీ షేక్ మసూమ్బాషా కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని సీహెచ్ గున్నేపల్లికి చెందిన వాండ్రపు రామకృష్ణ(26), వాండ్రపు శ్రీనివాస ప్రసాద్(బంకుశ్రీను) వరుసకు అన్నదమ్ములు. 2019 జూన్లో భూమి సరిహద్దు విషయంలో వారి మధ్య తగాదా ఏర్పడడంతో రామకృష్ణ.. శ్రీనివాసప్రసాద్ను దూషించాడు. దీంతో రామకృష్ణను హత్యచేయాలని ప్రసాద్ వ్యూహం పన్నాడు.
స్నేహితుడు చెయ్యేరు వీఆర్ఏ వాకాడ దుర్గా సత్యవరప్రసాద్ అలియాస్ దొరబాబుతో కలిసి గతంలో పంచాయతీలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేసిన కాట్రేనికోనకు చెందిన యువతిని రామకృష్ణకు ఎరవేశారు. 2019, డిసెంబర్ 8న ఆమెతో ఫోన్ చేయించి కాకినాడ రూరల్ మండలం చీడిగలో ఆమె అద్దెకు ఉంటున్న షణ్ముఖ అపార్టుమెంట్కు అతడిని రప్పించారు. అప్పటికే అక్కడే ఉన్న శ్రీనివాస ప్రసాద్, దుర్గాసత్యవరప్రసాద్ సునీత సాయంతో అతడి మెడకు నైలాన్ తాడు బిగించి హత్య చేశారు. అక్కడకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కాల్వలో మృతదేహానికి రాడు కట్టి పడవేశారు.
డిసెంబర్ 11న కరప మండలం అరట్లకట్ల కాల్వలో మృతదేహం తేలడంతో పోలీసులు హత్యకేసుగా నమోదు చేశారు. తాము వివాహం చేసుకున్నామని జనవరి 1న వస్తామని డిసెంబర్ 11న, 28న రామకృష్ణ తల్లి వెంకాయమ్మకు, సోదరికి సునీతతో ఫోన్ చేయించి చెప్పించారు. మూడు నెలల తర్వాత కుమారుడు కనిపించడం లేదని తల్లి వెంకాయమ్మ ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈనెల 12న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి చేధించారు. ఆదివారం ముగ్గురు నిందితులు చెయ్యేరు వీఆర్వోవద్ద లొంగిపోవడంతో సోమవారం వారిని అరెస్టుచేసి కోర్టులో హాజరుపర్చినట్టు డీఎస్పీ తెలిపారు.
హత్యకు ఉపయోగించిన నైలాన్తాడు, మోటార్సైకిల్, ఉంగరం, టార్చిలైట్, రూ.5వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ముమ్మిడివరం సీఐ బి.రాజశేఖర్, సిబ్బంది, డీఎస్పీ క్రైమ్ పార్టీని ఆయన అభినందించారు. సమావేశంలో ట్రైనీ డీఎస్పీ డి.బాలచంద్రారెడ్డి, సీఐ బి.రాజశేఖర్, ఇన్ చార్జి ఎస్ఐ కె.సత్య నారాయణ పాల్గొన్నారు. అదృశ్యం ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవడంతో ముమ్మిడివరం ఎస్ఐ ఎం.పండుదొరను డీఐజీ సస్పెండ్ చేశారని డీఎస్పీ తెలిపారు.