చివరి దశకు ధాన్యం కొనుగోళ్లు
ABN , First Publish Date - 2020-06-05T10:57:53+05:30 IST
జిల్లాలో రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేశారు. ఈ నెల 8వరకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు
338 కొనుగోలు కేంద్రాల్లో 303 ఇప్పటికే మూసివేత
3.44 లక్షల మెట్రిక్ వరి ధాన్యం కొనుగోలు
(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్)
జిల్లాలో రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేశారు. ఈ నెల 8వరకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ధాన్యం వస్తున్న కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. 338 కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం కొనుగోళ్లను చేపట్టగా 303 కేంద్రాల్లో రైతులు ధాన్యం తీసుకురాక పోవడంతో వాటిని మూసివేశారు. ఈ యాసంగి సీజన్లో జిల్లాలో 2 లక్షల 19వేల 66 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 5లక్షల 30వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అందులో విత్తన ధాన్యం, రైతులు సొంత అవసరాలకు ఉంచుకునే ధాన్యం మినహాయించి సుమారు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తాయని భావించారు.
కొన్న ధాన్యం విలువ రూ. 631.4 కోట్లు
అధికారుల అంచనాల మేరకు ఇప్పటికే 3లక్షల 44వేల 206 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి విక్రయించుకున్నారు. 69,733 మంది రైతు అమ్మిన ఈ ధాన్యం విలువ 631 కోట్ల 40 లక్షలు. మరో మూడు రోజులు కొనుగోళ్లు చేయనున్నందున 3.5 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం పూర్తవుతుందని భావిస్తున్నారు. జిల్లాలో కరోనా వ్యాధి నేపథ్యంలో తొలిసారి గ్రామగ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు 216 కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ 79 కేంద్రాలు, డీసీఎంఎస్ 41 కేంద్రాలు, మెప్మా, హాకా ఒక్కొక్క కొనుగోలు కేంద్రం ద్వారా వరి ధాన్యం సేకరణ నిర్వహించాయి. 69,733 మంది రైతులు 3 లక్షల 44వేల 206 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని విక్రయించారు.
ఇప్పటి వరకు 589.05 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం కొనుగోలు విషయాలను ఆన్లైన్లో నమోదు చేశారు. 54,146 మంది రైతులకు 513 కోట్ల 43 లక్షల రూపాయలు వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. 117 కోట్ల 97 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉన్నది. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యంలో 3,43,655 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మరో 550 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇంకా తరలించాల్సి ఉన్నది.
కొన్న ధాన్యాన్ని మిల్లులకు తక్షణమే తరలించాలి..అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్
జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తి కావస్తున్నందున రైతులందరికి డబ్బులు సత్వరమే అందేలా చూడాలని, వర్షాకాలం సమీపిస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు చేరవేయాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లు, రైతులకు డబ్బులు చెల్లింపు, ధాన్యం తరలింపు అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్న ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలించాలని సూచించారు.