ఆరిపోయే ప్రాణం భార్య పట్టుదలతో వెలిగింది!
ABN , First Publish Date - 2021-08-28T08:43:19+05:30 IST
వరైనా చావు అంచుల్లోకి వెళ్లి పూర్తి స్వస్థత పొందితే ‘వాడికి భూమ్మీద ఇంకా నూకలు బాకీ ఉన్నాయి కాబట్టే బతికాడు’ అని అంటూ ఉంటారు....
కొవిడ్తో 90 శాతం దెబ్బతిన్న ఊపిరితిత్తులు
వెంటిలేటర్ తొలగించొద్దన్న భార్య
3నెలలకు పూర్తిగా కోలుకున్న భర్త..
బ్రిటన్లో అద్భుతం
లండన్, ఆగస్టు 27: ఎవరైనా చావు అంచుల్లోకి వెళ్లి పూర్తి స్వస్థత పొందితే ‘వాడికి భూమ్మీద ఇంకా నూకలు బాకీ ఉన్నాయి కాబట్టే బతికాడు’ అని అంటూ ఉంటారు. కొవిడ్ సోకి మృత్యు ముఖంలోకి వెళ్లిన బ్రిటన్లోని యార్క్షైర్ వాసి 39 ఏళ్ల ఆడమ్ బ్యాంక్స్ మాత్రం ‘భార్య పట్టుదల’తోనే బతికాడు. ఊపిరితిత్తులు పనిచేయడం దాదాపు నిలిచిపోయి.. చికిత్సకు శరీరం స్పందించకపోవడంతో బ్యాంక్స్ను వెంటిలేటర్ మీద ఉంచారు. ఆశలన్నీ వదిలేసుకున్న డాక్టర్లు, బ్యాంక్స్ భార్యకు ఇదే చెప్పారు. అయితే ఆమె.. ఎన్ని రోజులైతే అన్ని రోజులు చికిత్స అందించాలని అర్థించింది. ఆమె ఈ ఆశే ఆయన ప్రాణం నిలబెట్టింది. బతికి బట్టకట్టడనుకున్న ఆ మనిషి, పూర్తిగా కోలుకొని భార్య, ఇద్దరు పిల్లలతో హాయిగా గడుపుతున్నాడిపుడు. బ్యాంక్స్కు చివరి ప్రయత్నంగా ఊపిరితిత్తులు, గుండె పనిచేసేందుకు ‘ఎక్మో’పై ఉంచి వైద్యం అందించారు. 3 నెలలు కొవిడ్తో పోరాడి గెలిచానని బ్యాంక్స్ చెప్పారు. రెండున్నర నెలల పాటు ఆహారం లేకుండానే ఉన్నానన్నారు. ఏప్రిల్ 19న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినా వారం క్రితమే తనకు కృత్రిమ ఆక్సిజన్ నుంచి విముక్తి కలిగిందని చెప్పారు.