లాక్డౌన్ మరింత కఠినం
ABN , First Publish Date - 2020-04-09T10:57:00+05:30 IST
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు, 13 మండలాల పరిధిలో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో లాక్డౌన్ను
కరోనా కాంటాక్టు వ్యక్తుల క్షేత్రస్థాయి సర్వే పక్కాగా జరగాలి
కలెక్టర్ వీరపాండియన్
కర్నూలు, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు, 13 మండలాల పరిధిలో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ వీరపాండియన్ జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ రవిపట్టన్శెట్టితో కలిసి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో 60 ఏళ్లు దాటిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు.
విదేశాలు, ఢిల్లీ నుంచి వచ్చిన కాంటాక్టు వ్యక్తులను క్షేత్ర స్థాయి సర్వే పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. స్థానిక వైద్యాధికారులు సూచించిన వ్యక్తుల నుంచి మాత్రమే శాంపిల్స్ సేకరిస్తామన్నారు. పాజిటివ్ ప్రాంతాలను కంటోన్మెంట్, బఫర్ జోన్లుగా ప్రకటించి వంద శాతం లాక్డౌన్ను అమలు చేయాలన్నారు. పాజిటివ్ కేసులకు సంబంధించి మొదటి, రెండోసారి కలిసిన వ్యక్తులను క్వారంటైన్లో ఉంచి వారికి వసతులు, భోజన సదుపాయం కల్పించాలన్నారు. కార్యక్రమంలో జేసీ-2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, జిల్లా పరిషత్ సీఈవో వెంకటసుబ్బయ్య, డీఎంహెచ్వో రామగిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.