నష్టం రూ.246 కోట్లు
ABN , First Publish Date - 2021-10-12T04:54:52+05:30 IST
గులాబ్ తుఫాన్ కారణంగా జిల్లాలో రూ.246.51 కోట్ల మేరకు నష్టం వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు రూపొందించిన నివేదికలను ప్రభుత్వానికి అందజేశారు.
రోడ్లు, విద్యుత శాఖలపై గులాబ్ ప్రభావం
ప్రభుత్వానికి నివేదించిన జిల్లా అధికారులు
కలెక్టరేట్, అక్టోబరు 11: గులాబ్ తుఫాన్ కారణంగా జిల్లాలో రూ.246.51 కోట్ల మేరకు నష్టం వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు రూపొందించిన నివేదికలను ప్రభుత్వానికి అందజేశారు. ప్రధానంగా విద్యుత్ పరికరాలు, రహదారులు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 855 ఇళ్లు దెబ్బతినగా.. ప్రజలు రూ.1.56 కోట్లు నష్టపోయారు. ఆర్ఆండ్బీ రహదారులు 320 కిలోమీటర్ల పరిధిలో దెబ్బతినడంతో రూ.122 కోట్లు, పంచాయతీ రహదారులు 60 కిలోమీటర్ల పరిధిలో దెబ్బతినగా రూ.58.53 కోట్లు, మున్సిపల్ రహదారులకు కోటీ 73 లక్షల రూపాయల నష్టం వచ్చింది. మైనర్ ఇరిగేషన్కు సంబంధించి 367 చెరువులు దెబ్బతినగా రూ.52కోట్ల నష్టం వచ్చింది. గ్రామీణ మంచి నీటి సరఫరా పథకాల విషయానికొస్తే 173 చోట్ల వివిధ రూపాల్లో దెబ్బతిన్నాయి. దీంతో రూ 4.7 కోట్ల నష్టం వచ్చినట్లు అంచనా వేశారు. మత్స్య శాఖ పరిధిలో కోటీ 34 లక్షల రూపాయల నష్టం వచ్చింది. విద్యుత్ శాఖకు సంబంధించి మొత్తంగా రూ.29.8కోట్లు నష్టం వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు.