భోజనం దేవుడా!
ABN , First Publish Date - 2020-04-09T10:52:50+05:30 IST
పాపం కార్మికులు.. పశ్చిమబెంగాల్, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చారు. తూప్రాన్ మండలం ఇమాంపూర్
టోల్ప్లాజా వద్ద నిత్యం 150 మంది కార్మికుల ఎదురుచూపులు
12 కిలోల బియ్యం, రూ.500కు నోచని అభాగ్యులు
వీరి విషయమే మరిచిన క్లారియన్ బేవరేజెస్
తూప్రాన్, ఏప్రిల్ 8: పాపం కార్మికులు.. పశ్చిమబెంగాల్, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చారు. తూప్రాన్ మండలం ఇమాంపూర్ శివారులోని క్లారియన్ బేవరేజెస్ కంపెనీలో పనికి కుదిరారు. లాక్డౌన్తో ఈ కంపెనీ కూడా మూతపడింది. అప్పటి నుంచి కార్మికులకు అవస్థలు మొదలయ్యాయి. లాక్డౌన్లోనూ వేతనాలు చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించినా కంపెనీ యాజమాన్యం పట్టించుకోలేదు. పైగా సొంతూరికి వెళ్లిపోవాలని కార్మికులకు సూచించింది. దీంతో పెట్టేబేడా సర్దుకుని తమ రాష్ట్రానికి వెళ్లేందుకు 150 మంది కార్మికులు సిద్ధం కాగా, అలా వెళ్లేందుకు వీల్లేదని పోలీసులు ఆపేశారు. దీంతో కంపెనీ వద్దే ఉండిపోయిన వారికి ఎలాగోలా మార్చి నెలాఖరు వరకు భోజనం పెట్టిన కంపెనీ యాజమాన్యం.. ఆ తర్వాత చేతులెత్తేసింది.
ఎక్కడివారక్కడే ఉండాలని, మనిషికి 12 కిలోల బియ్యం, రూ.500 ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయినా అవేమీ వీళ్ల దాకా రాలేదు. తూప్రాన్ టోల్ప్లాజా వద్ద ఎవరైనా భోజనాలు పెడితే అన్నమో రామచంద్రా అంటూ వెళ్లి తింటున్నారు. లేదంటే ఆ పూట పస్తులుంటున్నారు. బుధవారం కూడా టోల్ప్లాజా వద్దకు ఆశగా వచ్చారు. కానీ ఎవరూ భోజనం పెట్టకపోవడంతో ఆకలి... ఆకలంటూ ఇలా కూర్చుండిపోయారు. చివరకు ఓఅసోసియేషన్ వారికి తెలిసి వీరికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈపూట గడిచింది... రేపెలాగో గట్టెక్కించు అని కార్మికులు దేవుడిని వేడుకున్నారు.
కార్మికుల విషయమై కంపెనీ ప్లాంట్ ఇన్చార్జి రవికుమార్ను ఆంధ్రజ్యోతి ఫోన్లో సంప్రదించగా భోజనాల ఏర్పాటు విషయమై కాంట్రాక్టర్కు చెప్పామని, వాహనాల ఇబ్బందితో భోజనం అందడం లేదని దాటవేశారు.