పసుపు బోర్డు తెచ్చే వరకూ ఎంపీ వెంటపడాలి
ABN , First Publish Date - 2022-01-28T06:55:21+05:30 IST
ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డును తెస్తానని రైతులకు బాండ్ రాసిచ్చి ఇప్పటికీ తెలేదని, పసుపు బోర్డు తెచ్చే వరకూ రైతులు ఎంపీ అర్వింద్ వెంటపడాలని రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
జక్రాన్పల్లి, జనవరి 27: ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డును తెస్తానని రైతులకు బాండ్ రాసిచ్చి ఇప్పటికీ తెలేదని, పసుపు బోర్డు తెచ్చే వరకూ రైతులు ఎంపీ అర్వింద్ వెంటపడాలని రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. గురువారం జక్రాన్పల్లిలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాయమాటలు చెప్పి పసుపు రైతులను ఎంపీ అర్వింద్ మోసం చేశారని, మూడేళ్లు గడుస్తున్న పసుపుబోర్డు తెలేదని, ఆగ్రహంతో ఉన్న పసుపు రైతులు ఎంపీని ఎక్కడబడితే అక్కడ అడ్డుకుంటున్నా రన్నారు. దీన్ని రాజకీయం చేస్తూ టీఆర్ఎస్పై నిందలు మోపడం, అబద్దాలు మాట్లాడడం బీజేపీ నాయకులకు తగదన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రజల తగిన గుణపాఠం చెబుతారని చెబుతారన్నారు. అర్గుల్ నుంచి మునిపల్లి వరకు డబుల్రోడ్డు పనులు జరుగుతున్నాయని, అర్గుల్లో డబుల్రోడ్డు నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారికి డబుల్బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. అనంతరం అర్గుల్ నుంచి మునిపల్లి వరకు జరుగుతున్న డబుల్రోడ్డు పనులన పరిశీలించా రు. బ్రహ్మణ్పల్లి నుంచి తొర్లికొండ, కొలిప్యాక్ వరకు డబుల్రోడ్డును త్వరలో మంజూరు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దికొండ హరిత, జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, తనుజారెడ్డి, వైస్ఎంపీపీ విమల తదితరులు పాల్గొన్నారు.