రెండు ద్విచక్రవాహనాల ఢీ.. తండ్రీకొడుకుల దుర్మరణం

ABN , First Publish Date - 2021-07-31T08:33:56+05:30 IST

ప్రభుత్వోద్యోగం చేస్తున్న దివ్యాంగుడైన అన్న చనిపోవడంతో ఆయనకు కారుణ్య నియామకం కింద కొలువు వచ్చింది.

రెండు ద్విచక్రవాహనాల ఢీ.. తండ్రీకొడుకుల దుర్మరణం

దివ్యాంగుడైన అన్న మృతితో కారుణ్య నియామకం కింద ఉద్యోగం

కొలువులో చేరేందుకు తండ్రిని వెంట బెట్టుకొని వెళుతుండగా ప్రమాదం

ఏడాదిలో ఆ ఇంట్లో నలుగురు మృతి.. కుటుంబంలో పెను విషాదం


బిజినేపల్లి, జూలై 30: ప్రభుత్వోద్యోగం చేస్తున్న దివ్యాంగుడైన అన్న చనిపోవడంతో ఆయనకు కారుణ్య నియామకం కింద కొలువు వచ్చింది. ఉద్యోగంలో చేరేందుకు తండ్రితో కలిసి ద్విచక్రవాహనం మీద బయలుదేరాడు. అయితే వారు గమ్యానికి చేరలేదు. వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ద్విచక్రవాహన మీద ఉన్న ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఆ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ సమీపంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన చిన్న బాలయ్య గౌడ్‌ (65) పెద్ద కుమారుడు దివ్యాంగుడు.


ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆయన ఇటీవల మృతిచెందడంతో తమ్ముడు శివ కుమార్‌గౌడ్‌ (35)కు కారుణ్య నియామకం కింద గద్వాల మునిసిపాలిటీలో కొలువొచ్చింది. ఉద్యోగంలో చేరేందుకు ద్విచక్రవాహనం మీద తండ్రిని వెంటబెట్టుకొని శివ బయలుదేరాడు. మండలంలోని కోట్టాల్‌గడ్డకు చెందిన వినోద్‌, కోడేరు మండలంలోని తుర్కదిన్నె గ్రామానికి చెందిన రాఘవేందర్‌ కలిసి వనపర్తి వైపు నుంచి బిజినేపల్లి వైపు ద్విచక్రవాహనం మీద వస్తున్నారు. ఆటోను ఓవర్‌టేక్‌  చేసే క్రమంలో ఎదురెదురుగా ఉన్న శివకుమార్‌ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్నారు. ప్రమాదంలో బాలయ్య, శివ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వినోద్‌, రాఘవేందర్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని  చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. కాగా ఇటీవలే శివ కుమారుడు నిమోనియాతో బాధపడుతూ మృతిచెందాడు. ఏడాది వ్యవధిలోనే ఇంట్లో నలుగురు మృతిచెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులు విషాదంలో మునిగారు. 

Updated Date - 2021-07-31T08:33:56+05:30 IST