TRS Party సరికొత్త ఆలోచన.. ఏం జరుగుతుందో..!

ABN , First Publish Date - 2021-10-24T08:33:06+05:30 IST

టీఆర్‌ఎస్‌ నేతలకు సరికొత్త ఆలోచన తట్టింది...

TRS Party సరికొత్త ఆలోచన.. ఏం జరుగుతుందో..!

  • రోడ్‌షో కాదంటే టెలికాన్ఫరెన్సే!
  • హుజూరాబాద్‌లో సీఎం ప్రచారానికి వ్యూహం
  • దళిత బంధు లబ్ధిదారులతో మాటామంతీ


హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సమీక్షించడానికి టీఆర్‌ఎస్‌ నేతలకు సరికొత్త ఆలోచన తట్టింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారానికి టెలి కాన్ఫరెన్స్‌నే ఎందుకు వేదికగా చేసుకోకూడదు? అని యోచిస్తున్నారు. సీఎం నియోజకవర్గానికి వెళ్లి నేరుగా మాట్లాడే అవకాశం లేకపోతే... ఇలాంటి ఫోన్‌ కాన్ఫరెన్స్‌ను నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. స్థానికులను నేరుగా కేసీఆర్‌తో మాట్లాడించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం హుజూరాబాద్‌ దరిదాపుల్లోకే నేతలు రావొద్దంటూ ఆంక్షల మీద ఆంక్షలు విధిస్తోంది. పొరుగున ఉన్న కరీంనగర్‌, హన్మకొండ జిల్లాలకు కూడా ఆంక్షలు విస్తరించాయి. ‘కోడ్‌’ దాటితే కొరఢా ఝుళిపిస్తామంటూ ఈసీ హెచ్చరించింది. మరో పక్క ప్రచార పర్వం ముగింపు(ఈ నెల 27) దగ్గర పడుతోంది. ఉన్న నాలుగు రోజుల సమయాన్ని పక్కాగా వినియోగించుకోవడానికి రాజకీయ పార్టీలు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ కూడా అభ్యర్థి కోసం ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు అక్కడే ఉండి ప్రచారం సాగిస్తున్నారు.


ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రచారం చేయిస్తే మరింత కలిసి వస్తుందన్న ఆలోచనతో సభలు, రోడ్‌షోలు నిర్వహించాలని పార్టీ తలపెట్టింది. సభ నిర్వహణ వేదిక విషయంలో ఎటూ తేలడం లేదు. ఎక్కడ నిర్వహిస్తే ‘కోడ్‌’ దెబ్బ కొడుతుందోనన్న ఆందోళన నేతల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ ద్వారా రోడ్‌షోలు నిర్వహించాలని యోచిస్తున్నారు. రోడ్‌షోలు కూడా ఇంకా ఖరారు కాలేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విలేఖర్లకు వెల్లడించారు. రెండూ కాదంటే ప్రత్యామ్నాయంగా టెలికాన్ఫరెన్స్‌ను నిర్వహించాలని తాజాగా ముఖ్య నేతలు నిర్ణయించారని తెలిసింది. 

Updated Date - 2021-10-24T08:33:06+05:30 IST