అన్నతో పెళ్లిచూపులు.. తమ్ముడితో నిశ్చితార్థం

ABN , First Publish Date - 2021-04-06T08:37:16+05:30 IST

పెళ్లిచూపుల్లో అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఇరు కుటుంబాల పెద్దలు సంబంధం ఖాయం చేసుకున్నారు. కొద్దిరోజుల తరువాత అతడితో పెళ్లికి ఆ అమ్మాయి అభ్యంతరం చెప్పింది. అతడి తమ్ముడు నచ్చాడని, పెళ్లి చేసుకుంటానడంతో

అన్నతో పెళ్లిచూపులు.. తమ్ముడితో నిశ్చితార్థం

తమ్ముడిని చంపిన అన్న 


అచ్యుతాపురం, ఏప్రిల్‌ 5: పెళ్లిచూపుల్లో అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఇరు కుటుంబాల పెద్దలు సంబంధం ఖాయం చేసుకున్నారు. కొద్దిరోజుల తరువాత అతడితో పెళ్లికి ఆ అమ్మాయి అభ్యంతరం చెప్పింది. అతడి తమ్ముడు నచ్చాడని, పెళ్లి చేసుకుంటానడంతో నచ్చిన అతనితోనే నిశ్చితార్థం చేశారు. దీంతో ద్వేషం పెంచుకున్న అన్న సోమవారం జరిగిన ఘర్షణ నేపథ్యంలో తమ్ముడిని హత మార్చాడు. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక శివారు జాలారిపాలెంలో సంఘటన చోటు చేసుకుంది. మడ్డు రాజు అనే వ్యక్తి నెల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి భీమిలిలో పెళ్లి చూపులకు వెళ్లాడు. కాగా ఆ అమ్మాయి ఇష్టం ప్రకారం అతడి తమ్ముడు ఎర్రయ్య (23)తో 15 రోజుల  క్రితం నిశ్చితార్థం జరిగింది. వచ్చే నెలలో వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. అప్పటి నుంచి అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎర్రయ్య ఆదివారం చేపల వేటకు వెళ్లి రూ.2 వేలు సంపాదించగా సెల్‌ఫోన్‌ కొనుక్కొనేందుకు అన్నకి ఇవ్వాలని తల్లి చెప్పింది. ఈవిషయమై సోమవారం అన్నదమ్ములిద్దరూ గొడవపడ్డారు. మధ్యాహ్నం ఇంట్లో కత్తితో మాటువేసిన రాజు... లోపలకు వచ్చిన ఎర్రయ్య మెడపై బలంగా పొడవడంతో గాయపడ్డాడు. అనకాపల్లి తరలిస్తుండగా దారిమధ్యలో చనిపోయాడు. 



Updated Date - 2021-04-06T08:37:16+05:30 IST