సమాజంలో శాంతిస్థాపన కోసమే పోలీసులు
ABN , First Publish Date - 2021-10-22T05:31:22+05:30 IST
సమాజంలో శాంతిస్థాపన కోసం పోలీసు శాఖ నిర్విరామంగా కృషి చేస్తోందని, పోలీసు అమరవీరుల త్యాగాల ఫలితంగా నేడు సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొన్నదని పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ అన్నారు.
సీపీ వి సత్యనారాయణ
కరీంనగర్ క్రైం, అక్టోబరు 21: సమాజంలో శాంతిస్థాపన కోసం పోలీసు శాఖ నిర్విరామంగా కృషి చేస్తోందని, పోలీసు అమరవీరుల త్యాగాల ఫలితంగా నేడు సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొన్నదని పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గురువారం కమిషనరేట్ కేంద్రంలో ఏర్పాటైన స్మృతిపరేడ్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా అసాంఘిక శక్తులతో జరిపిన పోరులో 377 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లాకు చెందిన 47 మంది అమరవీరుల పోలీసుల కుటుంబాలకు సీపీ జ్ఞాపికలను, ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. అమరవీరుల స్థూపం వద్ద పోలీసులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం సీపీ పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. అమరవీరుల కుటుంబ సభ్యుల విన్నపాలను స్వీకరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రితిరాజ్, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, విజయసారఽథి, శ్రీనివాస్, శివభాస్కర్, ప్రతాప్, సీపీవో అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఉమేష్కుమార్, ఎస్బీఐలు వెంకటేశ్వర్లు, సంతోష్కుమార్, పోలీసు అధికారుల అసోసియేషన్ అధ్యక్షుడు (ఎస్ఐ) ఎం సురేందర్ పాల్గొన్నారు.