పోలీసులు భౌతికదూరం పాటించాలి

ABN , First Publish Date - 2020-04-05T10:39:03+05:30 IST

విధి నిర్వహణలో పోలీసులు భౌతిక దూరాన్ని పాటించాలని పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు.

పోలీసులు భౌతికదూరం పాటించాలి

పోలీసు కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి


కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 4: విధి నిర్వహణలో పోలీసులు భౌతిక దూరాన్ని పాటించాలని పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పోలీసులకు శనివారం కమిషనరేట్‌లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కరోనా వైరస్‌ మూడవ దశకు చేరుకునే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. భౌతిక దూరం పాటించడమే ప్రధాన నిరోధక చర్య అని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ద్విచక్రవాహనంకు ఒకరు, కార్లు, ఇతర వాహనాల్లో ఇద్దరు మాత్రమే నిర్ణీత సమయాలలో బయటకు రావచ్చని, నిబంధనలు విస్మరించే వారి వాహనాలను వెంటనే సీజ్‌ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.


విధి నిర్వహణలో ఉండే పోలీసులు ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారపదార్థాలను మాత్రమే తినాలని ఇతరులు అందించే భోజనం, పండ్లు, మజ్జిగ లాంటివి స్వీకరించకూడదని తెలిపారు. ఈ వైరస్‌ వ్యాప్తినిరోధానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఇక నుంచి ఎలాంటి వాహనాలకు అనుమతులు ఇవ్వొద్దని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్‌ డీసీపీలు ఎస్‌ శ్రీనివాస్‌, జి చంద్రమోహన్‌, ఏసీపీలు డాక్టర్‌ పి అశోక్‌, విజయసారథి, ఎస్‌ శ్రీనివాసరావు, శంకర్‌రాజు, సోమనాథం, ఎస్‌బీఐ ఇంద్రసేనారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-05T10:39:03+05:30 IST