భూ రికార్డుల స్వచ్ఛీకరణ పక్కాగా చేపట్టాలి
ABN , First Publish Date - 2020-02-23T07:39:06+05:30 IST
భూ రికార్డుల స్వచ్ఛీకరణ పక్కాగా చేపట్టాలని సీసీఎల్ఏ కార్యదర్శి ఆర్.హరినారాయణచక్రవర్తి అధికారులను
సీసీఎల్ఏ కార్యదర్శి హరినారాయణ చక్రవర్తి
కలెక్టరేట్, ఫిబ్రవరి 22: భూ రికార్డుల స్వచ్ఛీకరణ పక్కాగా చేపట్టాలని సీసీఎల్ఏ కార్యదర్శి ఆర్.హరినారాయణచక్రవర్తి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తహసీల్దార్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఫసలీ, అడంగళ్, డేటా వెరిఫికేషన్, వెబ్ల్యాండ్, కంపూటరైజేషన్, తదితర అంశాలపై సమీక్షించారు. భూ రికార్డుల స్వచ్ఛీకరణకు ఉపము ఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజలకు నిక్కచ్చి భూ రికార్డులను అందచేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. ఒరిజినల్ ఆర్ఎస్ఆర్తో వెబ్ ల్యాండ్లో కంప్యూటరీకరణ చేసిన ఆర్ఎస్ఆర్తో సరిపోల్చి ఏమైనా తప్పులుంటే సరిచేయాలని తెలిపారు.
అన్ని గ్రామాలూ వెబ్ల్యాండ్ పరిధిలోకి రావాలన్నారు. సంబంధిత రికార్డుల్లోని భూములను క్షేత్రస్థాయిలో వీఆర్వోలు, సర్వేయర్లు పరిశీలించాలన్నారు. ఆర్ఐలు రెవెన్యూ షటిల్మెంట్ రికార్డులను పక్కాగా పరిశీలించాలన్నారు. ఎఫ్ఎంబీతో సరిచూడాలని తెలిపారు. ఒక రైతుకు గ్రామంలో ఒకే ఖాతా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులను నమోదు చేసి రికార్డులను పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి భూ రికార్డుల ప్యూరిఫికేషన్ను వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జి కలెక్టర్ కె.శ్రీనివాసులు, సీసీఎల్ఏ ఓఎస్డీ ి డి.గోవిందరాజు, జిల్లా రెవెన్యూ అధికారి బి. దయానిధి, శ్రీకాకుళం, పాలకొండ ఆర్డీవోలు ఏవీ రమణ, టీవీఎస్జీ కుమార్, సర్వే ల్యాండ్ రికార్డు ఏఈ వైఎస్ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.