ఓటు హక్కు వజ్రాయుధం
ABN , First Publish Date - 2021-01-26T05:43:27+05:30 IST
ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, విలువైన ఓటు హక్కును వినియోగించుకోవడం పౌరులుగా మనందరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తంకుమార్ యువ ఓటర్లకు పిలుపునిచ్చారు.
వినియోగించుకోవడం మనందరి బాధ్యత
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తంకుమార్
కడప (కలెక్టరేట్), జనవరి 25: ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధం లాంటిదని, విలువైన ఓటు హక్కును వినియోగించుకోవడం పౌరులుగా మనందరి బాధ్యత అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తంకుమార్ యువ ఓటర్లకు పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లోని సభాభవనంలో 11వ జాతీయ ఓటర్ల దినోత్సవం కలెక్టర్ హరికిరణ్ అధ్యక్షతన జరిగింది. కార ్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ 1950వ సంవత్సరం జనవరి 25వ తేదీ భారత ఎన్నికల సంఘం ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏడాది జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఓటు హక్కును చాటి చెప్పే విధంగా ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎన్నికల సంఘం నిర్వహిస్తోందన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటు హక్కు పొంది, బాధ్యతగా మంచి పాలకులను ఎన్నుకునేలా ఓటు హక్కును వినియోగించుకోవాలని యువ ఓటర్లకు పిలుపునిచ్చారు. కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 22.55 లక్షల మందికి పైగా ఓటర్లున్నారన్నారు. వీరందరూ బాధ్యతగా దేశ భవిష్యత్తును నిర్ధేశించే పాలకులను ఎన్నుకునే విధంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో కేవలం 50-60 శాతం మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాబోయే ఎన్నికల్లో 100 శాతం ఓటింగ్ నమోదు కావాలన్నారు. అనంతరం జిల్లాలో కొత్తగా ఓటు హక్కు పొందిన యువతకు జిల్లా జడ్జి, కలెక్టర్ తదితర ముఖ్యఅతిథులు నూతన ఈ-ఎపిక్ కార్డులను అందజేశారు. సీనియర్ ఓటర్లను శాలువలతో సన్మానించారు. కార్యక్రమానికి ముందుగా పలువురు విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ సెక్రటరీ టి.వెంకటేశకుమార్, ప్రొటోకాల్ జడ్జి, జిల్లా అదనపు మేజిస్ట్రేట్ షేక్ రియాజ్లతో పాటు డీఆర్వో మలోల, అధికారులు సుధాకర్రెడ్డి, లవన్న, రామచంద్రారెడ్డి, పద్మజ, తహసీల్దారు శివరామిరెడ్డి, శివారెడ్డి, ఏవో గంగయ్య, తదితర అధికారులు పాల్గొన్నారు.