డిసెంబర్ నెలాఖరులోపు రెండో ఘాట్ రోడ్డు సిద్ధం కావాలి
ABN , First Publish Date - 2021-12-04T07:56:57+05:30 IST
నూతన సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో డిసెంబర్ నెలాఖరులోపే రెండో ఘాట్ రోడ్డు సిద్ధం చేయాలని అధికారులను టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ఆదేశించారు.
అధికారులతో టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి
తిరుపతి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో డిసెంబర్ నెలాఖరులోపే రెండో ఘాట్ రోడ్డు సిద్ధం చేయాలని అధికారులను టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ఆదేశించారు. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో శుక్రారం ఆయన ఐఐటీ నిపుణులతో సమావేశమయ్యారు. ప్రమాదకరంగా ఉన్న కొండ చరియలను ఇబ్బందులు లేనివిధంగా తొలగించేందుకు కెమికల్ టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. భక్తుల శ్రేయస్సు దృష్ట్యా ఈ విషయంలో ఖర్చుకు ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. కొంత సమయం తిరుమల నుంచి తిరుపతి, మరికొంత సమయం తిరుపతి నుంచి తిరుమలకు వాహనాలను అనుమతిస్తుండటం వల్ల అటు కొండపైన, ఇటు అలిపిరిలో భక్తులు నిరీక్షిస్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. రెండో ఘాట్ రోడ్డులో లింక్ రోడ్డు ద్వారా శనివారం నుంచి వాహనాలను అనుమతించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో టీటీడీ సభ్యుడు పోకల అశోక్కుమార్, అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి, ఢిల్లీ ఐఐటీ నిపుణులు రావు, ఇంజనీరింగ్ సలహాదారు రామచంద్రారెడ్డి, సీఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.