26న రైతుభరోసా రెండో విడత
ABN , First Publish Date - 2021-10-22T08:41:48+05:30 IST
రైతు భరోసా రెండో విడత కార్యక్రమాన్ని ఈనెల 26వ తేదీన అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. 2020 ఖరీ్ఫకు సంబంధించిన..
- ఉపాధి పనులపై ప్రత్యేక దృష్టి
- 2023కు సమగ్ర భూసర్వే పూర్తి: సీఎం జగన్
అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): రైతు భరోసా రెండో విడత కార్యక్రమాన్ని ఈనెల 26వ తేదీన అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. 2020 ఖరీ్ఫకు సంబంధించిన సున్నావడ్డీ పంట రుణాలు అందిస్తామన్నారు. అర్హులెవరూ మిగిలిపోకూడదని, అనర్హులకు అందకూడదని స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం స్పందన కార్యక్రమంలో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకం, రబీ సన్నద్ధత, వైఎ్సఆర్ శాశ్వత భూహక్కు- భూరక్ష, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, గ్రామ,వార్డు సచివాలయాల తనిఖీలు, వైఎ్సఆర్ అర్బన్ క్లీనిక్స్పై సీఎం సమీక్షించారు. ఈ నెల, వచ్చేనెలల్లో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రకటించారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. నెల్లూరులో జరిగిన ఘటన తన దృష్టికి వచ్చిందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టరును సీఎం ఆదేశించారు. సీడ్ కార్పొరేషన్ ఎంప్యానల్ అయిన కంపెనీల ఉత్పత్తులను మాత్రమే రైతులకు చేరవేయాలన్నారు.
జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం విప్లవాత్మకమైనదని, భూ వివాదాలకు చెక్ పెడుతుందని చెప్పారు. ప్రతి గ్రామ సచివాలయంలోనూ సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం ఉంటుందని ప్రకటించారు. వందేళ్ల కిందట భూసర్వే జరిగిందని, రాష్ట్రంలోని 51 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా భూసర్వే జరుగుతోందని, దీనిని జాతికి అంకితం చేస్తామని సీఎం చెప్పారు. 2023 జూన్ కల్లా రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తవుతుందని తెలిపారు. అలాగే, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వల్ల 47.4 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని, వారికి పట్టాలు అందుతాయని చెప్పారు.