16 నుంచి రెండో విడత రేషన్
ABN , First Publish Date - 2020-04-09T12:19:43+05:30 IST
జిల్లావ్యాప్తంగా ఈనెల 16వతేది నుంచి రెండో విడత రేషన్ పంపిణీ జరగనుంది.
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 8: జిల్లావ్యాప్తంగా ఈనెల 16వతేది నుంచి రెండో విడత రేషన్ పంపిణీ జరగనుంది. జిల్లాలో 11,33,554 రేషన్కార్డుల పరిధిలో 47,23,261 మంది లబ్ధిపొందుతున్నారు. వీరందరికీ రెండో విడత ఐదు కేజీల వంతున బియ్యం అందజేయనున్నారు. తొలివిడత కందిపప్పు అందజేయగా, ఈమారు శనగపప్పు అందజేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఇందుకు ఒక్కో చౌకదుకాణ పరిధిలో అదనంగా మూడు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆ మేరకు 2900 చౌకదుకాణాలకు అదనంగా 8700 కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
ఒక్కో కేంద్రంలో ఒక్కో రంగు టోకెన్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. అదనపు కౌంటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని చౌకదుకాణ డీలర్లు వ్యతిరేకిస్తున్నారు. బియ్యం పంపిణీలో వలంటీరు లేదా ఇతరులు తూకం సక్రమంగా వేయకుంటే కేజీకి రూ.36 అదనంగా చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు. లేదంటే ఆర్ఆర్ చట్టం కింద కేసులు నమోదవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో చేసే తప్పునకు తాము బాధ్యులమెలా అవుతామని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు తమ పేరిట కాకుండా ఆయా కౌంటర్ వలంటీర్ లేదా సిబ్బంది పేరిట ఆర్వో ఇస్తే అభ్యంతరం లేదని అంటున్నారు.