తల్లికి కొవిడ్ వచ్చిందని చెప్పాడు.. రెండు నెలల తర్వాత విషయం తెలిసి అంతా షాక్
ABN , First Publish Date - 2021-10-06T22:54:38+05:30 IST
యూకేలోని పెంబ్రోక్డాక్ ప్రాంతంలో జుడిత్ రీడ్ (68) అనే వృద్ధురాలు.. తన తనయుడు డేల్ మోర్గాన్(43) వద్ద ఉంటోంది. అయితే గత ఏడాది డిసెంబర్లో ఆమె అదృశ్యమైంది. అయితే తన తల్లికి కొవిడ్ సోకిందని, అందుకే ఐసోలేషన్లో ఉంటోందని కొడుకు.. అందరికీ చెప్పాడు.
నవమాసాలూ మోసి, కని.. పెంచిన తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. డబ్బు చుట్టే ప్రపంచం నడుస్తోంది. మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. యూకేలో ఓ జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఓ వ్యక్తి అందరితో తన తల్లికి కొవిడ్ సోకిందని, ఐసోలేషన్లో ఉందని చెప్పాడు. రోజూ ఆమె నుంచి సన్నిహితులకు మెసేజ్లు కూడా వెళ్లేవి. దీంతో అంతా నిజమే అనుకున్నారు. అయితే చివరకు అతడి నిర్వాహం బయటపడింది. యూకేలోని పెంబ్రోక్షైర్ రాష్ట్రంలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళితే..
యూకేలోని పెంబ్రోక్డాక్ ప్రాంతంలో జుడిత్ రీడ్ (68) అనే వృద్ధురాలు.. తన తనయుడు డేల్ మోర్గాన్(43) వద్ద ఉంటోంది. అయితే గత ఏడాది డిసెంబర్లో ఆమె అదృశ్యమైంది. అయితే తన తల్లికి కొవిడ్ సోకిందని, అందుకే ఐసోలేషన్లో ఉంటోందని కొడుకు.. అందరికీ చెప్పాడు. తన తండ్రి కూడా నిజమే అనుకున్నాడు. ఈ క్రమంలో తల్లి సెల్ నుంచి అందరికీ మెసేజ్లు కూడా వెళ్లేవి. అయితే రెండు నెలలు అవుతున్నా.. ఆమె బయటికి రాకపోవడంతో సన్నిహితులకు అనుమానం కలిగింది. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటిని మొత్తం పరిశీలించారు. అయితే బెడ్ రూంలో వృద్ధురాలి మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తనిఖీల్లో ఓ సుత్తిని, రీడ్ రాసిన నోట్ దొరికింది. అందులో తన కొడుకు డ్రగ్స్కు అలవాటు పడి, చోరీలు చేస్తున్నట్లు వృద్ధురాలు పేర్కొంది.
విచారణలో పలు సంచలన విషయాలు వెలుగుచూశాయి. వృద్ధురాలిని డబ్బుల కోసమే హత్య చేసినట్లు తేలింది. ఆమె బ్యాంక్ అకౌంట్లో మొత్తం 2,878 పౌండ్లు(రూ.2.92 లక్షలు) విత్డ్రా చేసినట్లు తెలిసింది. తర్వాత డబ్బులు ఇవ్వకపోవడంతో కోపంతో.. తల్లి అని కూడా చూడకుండా సుత్తితో మోది హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు. తర్వాత మృతదేహాన్ని కవర్లో చుట్టి ఇంట్లోనే భద్రపరిచాడు. నేరం బయటపడడంతో కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది.