దొంగతనం చేశాడని చంపేశారు

ABN , First Publish Date - 2021-06-22T07:07:44+05:30 IST

వైన్స్‌ దుకాణంలో దొంగతనం చేశాడని కుమారుడిని కొట్టి చంపారని భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన కాసుల పార్థసారథి(37)తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దొంగతనం చేశాడని చంపేశారు

భూదాన్‌పోచంపల్లి, జూన్‌ 21: వైన్స్‌ దుకాణంలో దొంగతనం చేశాడని కుమారుడిని కొట్టి చంపారని భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన కాసుల పార్థసారథి(37)తల్లి లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పార్థసారథి  నాలుగేళ్లుగా అనారోగ్యంతోపాటు మద్యానికి బానిసయ్యాడు. భార్య కూడా వదిలి వెళ్లిపోవడంతో తల్లి వద్ద ఒంటరిగా ఉంటున్నాడు. పార్థసారథి బంధువు రంగ శివ ఘట్‌కేసర్‌ మండలం అంకిరెడ్డిపల్లిలోని శ్రీదుర్గ వైన్స్‌లో పనిచేస్తున్నాడు. రంగ తనకు సహాయకారిగా ఉండేందుకు పార్థసారథిని తీసుకువెళ్లాడు.  ఈనెల 16న అంకిరెడ్డిపల్లికి వెళ్లిన పార్థసారథి అదే రోజు ఇంటికి వచ్చాడు.  ఈనెల 17న రంగ శివ, ఆయన సోదరుడు రమే్‌షలు పెద్దగూడెం గ్రామానికి వచ్చి వైన్స్‌లోని క్యాష్‌ కౌంటర్‌లో డబ్బు తీశావని చెప్పి పార్థసారథిని తీసుకువెళ్లి కొట్టారు.  ఈనెల 19న పార్థసారథి శరీరంపై దెబ్బలను గుర్తించిన తల్లి జండూబాం రాసింది. కుమారుడికి నొప్పులు తగ్గనందున ఘట్‌కేసర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించింది. చికిత్స పొందుతూ కుమారుడు ఈనెల 20వ తేదీ రాత్రి మృతి చెందాడు.  శివ, రమే్‌షలు కొట్టడంతోనే తన కుమారుడు అస్వస్థతకు గురై మృతి చెందాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పార్థసారథి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పోలీసులు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  

Updated Date - 2021-06-22T07:07:44+05:30 IST