మోగిన సమ్మె సైరన్
ABN , First Publish Date - 2021-12-01T06:06:48+05:30 IST
సింగరేణిలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో సమ్మె చేయనున్నట్టు గుర్తింపు సంఘం టీబీజీకేఎస్తో పాటు జాతీయ సంఘాలు ఏఐటీయూ సీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, ఐఎన్టీయూసీ ప్రకటించాయి.
- 9, 10, 11తేదీల్లో సింగరేణి వ్యాప్తంగా సమ్మె
- పిలుపునిచ్చిన అన్ని కార్మిక సంఘాలు
- బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిర్ణయం
గోదావరిఖని, నవంబరు 30: సింగరేణిలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో సమ్మె చేయనున్నట్టు గుర్తింపు సంఘం టీబీజీకేఎస్తో పాటు జాతీయ సంఘాలు ఏఐటీయూ సీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, ఐఎన్టీయూసీ ప్రకటించాయి. మంగళవారం స్థానిక ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు వెంకట్రావ్, సీతారామయ్య, తుమ్మల రాజారెడ్డి, యాదగిరి సత్తయ్య, జనక్ ప్రసాద్, జక్కుల నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వరంగ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ చేస్తూ కార్మికులను రోడ్డున పడవేస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 88బొగ్గు బ్లాకులను వేలం వేయాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించగా అందులో సింగరేణి పరిధిలోకి వచ్చే ఖమ్మం జిల్లా లో రెండు, మంచిర్యాల జిల్లాలో రెండు బొగ్గు బ్లాకులను వేలం వేయాలని నిర్ణయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. సింగరేణిలో బొగ్గు బ్లాకుల వేలాన్ని ఉప సంహరించుకోకపోతే ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. భూగర్భ గనుల్లో బొగ్గు తీసే పనులను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పుతూ పర్మినెంట్ కార్మికులను తగ్గించి కాంట్రాక్టు కార్మికులను ప్రోత్సహిస్తున్నారని, కొండాపూర్, జీవీకే మైన్, కేటీకే 8ఇంక్లైన్తో పాటు అడ్రియాలలోని రెండు లాంగ్వాల్ ప్రాజెక్టులను యాజమాన్యం ప్రైవేట్వాళ్లకు అప్పగించిందని, వీటిని ఉప సంహరించుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఓపెన్కాస్టుల్లో కూడా బొగ్గు తీసే పనిని కాంట్రాక్టర్లకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని, గతంలో ఇల్లందులో సర్ఫేస్ మైనర్ను దింపి బొగ్గును ప్రైవేట్ కంపెనీచే ఉత్పత్తి చేయాలని ప్రయ త్నిస్తే అప్పుడు 18రోజులు సమ్మె చేసి ప్రైవేట్ వారు బొగ్గు తీయకుండా అడ్డుకోవడం జరిగిందని, ఇప్పుడు మళ్లీ బొగ్గు తీసే పనిని కాంట్రాక్టర్లకు అప్పగించాలని చూస్తుందని, కిష్టాపూర్, ఇందారం, భూపాలపల్లి ఓసీపీ-3లో బొగ్గు తీసే పనిని కాంట్రాక్టర్లకు అప్పగించిందని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు, అదే విధంగా మైనిం గ్ స్టాఫ్ సమస్యలను పరిష్కరించాలని, మైనింగ్ స్టాఫ్ మెడికల్ అన్ఫిట్ అయితే వారికి సుటబుల్ జాబ్ ఇవ్వాలని, అలా కాకుండా జనరల్ మజ్దూర్గా ఇస్తున్నారని, ప్రమాదాలకు కేవలం మైనింగ్ స్టాఫ్ను బాధ్యులను చేయడం సరైంది కాదన్నారు. కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలను చెల్లించాలని, కోల్ ఇండియాలో అమలవుతున్న హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించకుండా కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. సింగరేణి సంస్థలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, బొగ్గు బ్లాకుల వేలం పాటలకు వ్యతిరేకంగా డిసెంబర్ 9, 10,11తేదీల్లో జరిగే సమ్మెను కార్మికులు విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు నర్సింహారెడ్డి, మడ్డి ఎల్లయ్య, ధర్మపురి పాల్గొన్నారు.