వంతెన కూలి కాలువలో పడిన వ్యాన్
ABN , First Publish Date - 2022-01-18T09:11:29+05:30 IST
అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలోని తుంగభద్ర ఎగువ కాలువ
- మహిళా కూలీ గల్లంతు..
- 29 మందిని రక్షించిన స్థానికులు
బొమ్మనహాళ్, జనవరి 17: అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలోని తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) 115-167వ కిలోమీటర్ వద్ద సోమవారం మల్లికేతి వంతెన కుప్పకూలి.. కూలీల వ్యాన్ అందులో చిక్కుకుంది. ఓ మహిళా కూలీ కాలువ నీటిలోపడి గల్లంతవ్వగా.. ఆమె కుమార్తె సహా 29 మంది క్షేమంగా బయటపడ్డారు. ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన 30 మంది వ్యవసాయ కూలీలు.. ఓ మినీ వ్యాన్లో సోమవారం హెచ్చెల్సీ అవతల పొలం పనులకు వెళ్లి వ్యాన్లో తిరి గి వస్తుండగా.. హెచ్చెల్సీ వంతెన దాటుతున్న సమయంలో ఒక్కసారిగా వంతెన కుప్పకూలింది. వ్యాన్ కాలువలో ఇరుక్కుపోయింది. కూలీల తోపులాటలో ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన బోయ సావిత్రి(34) కాలువలో గల్లంతైంది. సమీప పొలాల్లోని రైతులు పరిగెత్తుకొచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కూలీలను ఒడ్డుకు లాగారు. కళ్లెదుటే తల్లి సావిత్రి గల్లంతవడంతో కూతురు గంగమ్మ కన్నీరుమున్నీరైంది.