చెన్నై వైపు కొవిడ్‌ బాధితుల చూపు

ABN , First Publish Date - 2021-05-08T06:54:19+05:30 IST

మెరుగైన చికిత్స కోసం పక్క రాష్ర్టానికి వెళుతున్న జనం

చెన్నై వైపు కొవిడ్‌ బాధితుల చూపు

మెరుగైన చికిత్స కోసం పక్క రాష్ర్టానికి వెళుతున్న జనం

ఇదే అవకాశంగా అంబులెన్సు ఆపరేటర్ల దోపిడీ


తిరుపతి, మే 7 (ఆంధ్రజ్యోతి): గంగవరం మండలం గండ్రాజుపల్లె పరిసర ప్రాంతానికి చెందిన 45 ఏళ్ళ వ్యక్తికి గత మార్చి 22న కరోనా లక్షణాలు కనిపించాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో టెస్టు చేయించుకుంటే ఫలితం ఆలస్యంగా వస్తుందన్న భావనతో 23న వేలూరు సీఎంసీ ఆస్పత్రికి వెళ్ళి టెస్టు చేయించుకున్నారు. పాజిటివ్‌ అని తేలడంతో అదే రోజు అక్కడ నుంచీ నేరుగా తిరుపతి వచ్చి రుయాస్పత్రిలో చేరిపోయారు. 24 గంటలు గడిచినా డాక్టర్‌ కాదుకదా నర్సు కూడా దగ్గరకొచ్చి పలకరించలేదు. అక్కడే వుంటే ప్రాణం పోతుందన్న ఆందోళనతో బాధితుడు నగరంలోనే కాస్త పేరున్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్ళారు. అక్కడ 24-25 తేదీల నడుమ 24 గంటల పాటు అడ్మిషన్‌లో వున్నందుకు రూ. 70 వేలు బిల్లు చెల్లించాల్సి వచ్చింది. అంతడబ్బు కట్టినా రుయాస్పత్రిలోని పరిస్థితే అక్కడా ఎదురైంది. దీంతో 25న రాత్రికి రాత్రే చెన్నై చేరుకుని గ్లోబల్‌ ఆస్పత్రిలో చేరిపోయారు. రూ. 4.15 లక్షలు ఖర్చు పెట్టుకుని అక్కడ ఎనిమిది రోజుల పాటు చికిత్స తీసుకున్నాక ఏప్రిల్‌ 4న కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్‌ ఆస్పత్రుల్లో పరిస్థితులను కళ్ళకు కట్టడమే కాదు కొవిడ్‌ బాధితులు ఎందుకు చెన్నై వైపు చూస్తున్నారనేందుకు ఈ ఘటన అద్దం పడుతోంది. జిల్లాలో చెప్పుకోదగ్గ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులున్నా చాలావరకూ కొవిడ్‌ బాధితులకు తగిన తగిన వైద్య సేవలు అందడం లేదనన్న భావన నెలకొంటోంది.ఇటీవలే చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పుంగనూరుకు చెందిన కొవిడ్‌ బాధితుడొకరు టాయిలెట్‌కు వెళ్ళే మార్గంలో చనిపోయి నేలపైనే పడివుండగా గంటల కొద్దీ సిబ్బంది పట్టించుకోకుండా వదిలేయడం దుమారం రేపింది. అడ్మిషన్లు దొరక్కపోవడం, బెడ్ల కోసం గంటలు, రోజుల తరబడీ నిరీక్షించాల్సి రావడం, దొరికినా ఆక్సిజన్‌ కొరత, అవన్నీ సమకూరినా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, రెమ్‌డెసివిర్‌ వంటి అత్యవసర మందుల దందా వంటి సవాలక్ష కారణాలు కొవిడ్‌ బాధితులను బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో డబ్బున్న వారంతా మెరుగైన వైద్యం కోసం అనివార్యంగా చెన్నై వైపు చూస్తున్నారు. డబ్బు ఖర్చయినా పర్వాలేదు తమవారు బతికితే చాలన్న తపనతో కుటుంబీకులు కూడా బాధితులను చెన్నై తీసుకెళ్ళి కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చేర్పిస్తున్నారు. ఈ నేపధ్యంలో చెన్నై నగరంలోని ఏ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చూసినా జిల్లాకు చెందిన బాధితులే ఎక్కువగా కనిపిస్తున్నారని సమాచారం. అలాగని చెన్నై వెళుతున్న కొవిడ్‌ బాధితులంతా కోలుకుంటున్నారని కాదు.అక్కడా ఎంతోమంది జిల్లావాసులు చనిపోతున్నారు. కాకుంటే ఖర్చుపెట్టిన డబ్బుకు తగిన వైద్యం, శ్రద్ధ అక్కడి ఆస్పత్రుల్లో లభ్యమవుతున్నాయన్న భావన వారిలో వ్యక్తమవుతోంది.బాధితుల ఆందోళన, వారి కుటుంబీకుల ఆరాటం వెరసి అంబులెన్సు ఆపరేటర్ల పంట పండుతోంది. జిల్లా నుంచీ చెన్నై, బెంగుళూరు వంటి నగరాలకు బాధితులను తరలించేందుకు దూరం, వ్యయంతో నిమిత్తం లేకుండా కళ్ళు తిరిగే ఽఛార్జీలు వసూలు చేస్తున్నారు. చెన్నైకి అయితే కనీసం రూ. 50 వేలకు తక్కువ కాకుండా డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2021-05-08T06:54:19+05:30 IST