కోటవురట్ల, నక్కపల్లి మండలాల్లో 12 మందికి వైరస్‌

ABN , First Publish Date - 2022-01-20T06:26:30+05:30 IST

మండలంలో పదకొండు మందికి కరోనా నిర్ధారణ జరిగినట్టు కె.వెంకటాపురం పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్‌ ఉమాదేవి బుధవారం తెలిపారు.

కోటవురట్ల, నక్కపల్లి మండలాల్లో 12 మందికి వైరస్‌
పిల్లలను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకు వెళ్లడంతో ఖాళీగా వున్న మనబాలవానిపాలెం పాఠశాల ఆవరణ

కోటవురట్ల, జనవరి 19 :  మండలంలో పదకొండు మందికి కరోనా నిర్ధారణ జరిగినట్టు కె.వెంకటాపురం పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్‌ ఉమాదేవి బుధవారం తెలిపారు. ఈ పీహెచ్‌సీ పరిధిలోని కోటవురట్లలో ఒకరు, శివారు గ్రామం రాట్నాలపాలెం బీసీ కాలనీలో ఇద్దరు మహిళలు, లింగాపురంలో ఇద్దరు, తంగేడులో ఇద్దరు, సుంకపూర్‌లో ఇద్దరు, నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో ఇద్దరు వైరస్‌ బారిన పడ్డారని ఆమె వివరించారు.

మనబాలవానిపాలెం పాఠశాలలో హెచ్‌ఎంకు..

నక్కపల్లి : కరోనా థర్డ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లాలంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళన చెందుతున్నారు. తాజాగా నక్కపల్లి మండలం ఉపమాక శివారు మనబాలవానిపాలెం ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎంకు వైరస్‌ నిర్ధారణ జరిగింది. దీంతో బుధవారం పాఠశాలకు వెళ్లిన పిల్లలను వారి తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకు వెళ్లిపోయారు.  ఇక్కడ ఒకటి నుంచి ఐదు తరగతుల వరకూ సుమారు 109 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. హెచ్‌ఎం సహా మరో ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. హెచ్‌ఎం కరోనా కారణంగా సెలవు పెట్టగా, మరో ఉపాధ్యాయుడు వ్యక్తిగత పనిపై సెలవు పెట్టారు. దీంతో ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే పాఠశాలలో ఉన్నారు. పిల్లలు ఇళ్లకు వెళ్లిపోయినప్పటికీ, ఆయన మాత్రం సాయంత్రం వరకూ పాఠశాలలోనే ఉన్నారు. పాఠశాల ప్రాంగణం, తరగతి గదుల్లో  శానిటేషన్‌ పనులు చేపట్టారు. 

Updated Date - 2022-01-20T06:26:30+05:30 IST