ఆర్ఆర్ సెంటర్ల పనులు వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-08-31T05:44:29+05:30 IST
గట్టు భూసేకరణ, ఆర్ఆర్ సెంటర్ల పెండింగ్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి నీటి పారుదల, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు.
- అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశం
గద్వాల క్రైం, ఆగస్టు 30 : గట్టు భూసేకరణ, ఆర్ఆర్ సెంటర్ల పెండింగ్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి నీటి పారుదల, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. గట్టు ఎత్తిపోతల పథకం పనులు ఎంతవరకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎస్ఈ, ఆర్డీవో తెలిపారు. గట్టు ఎత్తిపోతల పథకంలో భాగంగా ఆలూరు ఆప్రోచ్ కెనాల్ పంప్హౌస్, ప్రెషర్ మెయిన్స్ గుర్తించి సర్వే పూర్తి చేసినట్లు చెప్పారు. రిజర్వాయర్ పనులను వేగవంతం చేస్తామన్నారు. ఎత్తిపోతలకు సంబంధించిన మ్యాప్ ద్వారా కలెక్టర్కు వివరించారు. నెట్టెంపాడు ప్రాజెక్ట్ పరిధిలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు ఏ మేరకు పూర్తి అయ్యాయని కలెక్టర్ ఆరా తీశారు. మిగితా పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ర్యాలంపాడు పునరావాస కేంద్రాల పనుల వివరాలను తెలుసుకున్నారు. ఆర్ఆర్ సెంటర్లలో రోడ్లు, డ్రైనేజీలు, భవనాల నిర్మాణం, విద్యుత్ ఏర్పాటు తదితర పనులను త్వరగా మొదలు పెట్టాలని ఆదేశించారు. పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ, నివేదికలు పంపించాలని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో రాములు, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసులు పాల్గొన్నారు.