విప్లవ పార్టీ నేతలను పొట్టన పెట్టుకున్న వైఎస్‌ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-01-17T07:07:36+05:30 IST

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ ప్రభుత్వం చర్చల పేరుతో పిలిచి ఎంతోమంది విప్లవ పార్టీ నేతలను ఎన్‌కౌంటర్‌ చేసి పొట్టన పెట్టుకుందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క అన్నారు.

విప్లవ పార్టీ నేతలను పొట్టన పెట్టుకున్న వైఎస్‌ ప్రభుత్వం
అమర్‌నగర్‌లో లక్ష్మారెడ్డి స్తూపానికి నివాళులర్పిస్తున్న విమలక్క

హుజూర్‌నగర్‌ , జనవరి 16 : ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ ప్రభుత్వం చర్చల పేరుతో పిలిచి ఎంతోమంది విప్లవ పార్టీ నేతలను ఎన్‌కౌంటర్‌ చేసి పొట్టన పెట్టుకుందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క అన్నారు. హుజూర్‌నగర్‌ మండలం అమర్‌నగర్‌లో కాకి లక్ష్మారెడ్డి మూడో వర్ధంతి సందర్భంగా ఆయన స్తూపానికి పూలమాలలు వేసి ఆదివారం నివాళులర్పించారు. అనంతరం జరిగిన వర్ధంతి సభలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో మావోయిస్టులతో చర్చలు జరిపిన వైఎస్‌ ప్రభుత్వం వ్యవసాయ భూమి సమస్యలపై చర్చించేందుకు ఇష్టపడలేదన్నారు. భూమిలేని పేదల పక్షాన విప్లవ పార్టీ నిలిచిందన్నారు. అర్ధాంతరంగా చర్చలు నిలిపివేసి ఎంతోమంది విప్లవ పార్టీ నాయకులను ఎన్‌కౌంటర్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రియాజ్‌ లాంటి గొప్ప విప్లవకారులను నాడు కోల్పోయామన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కాకి లక్ష్మారెడ్డి వీరోచిత పోరాటాలు చేశారన్నారు. నక్సల్‌బరీ ఉద్యమానికి వెన్నుముకగా నిలిచారన్నారు. కరీంనగర్‌, వరంగల్‌, ఉమ్మడి నల్లగొండ జిల్లా, గోదావరి లోయలో జరిగిన ఉద్యమాల్లో చు రుకైన పాత్ర పోషించారన్నారు. విప్లవోద్యమంలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను గుర్తించి ఆర్థికంగా ఆదుకోవాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, అఖిల భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వక్కవంతులో కోటేశ్వరరావు కోరారు. 




Updated Date - 2022-01-17T07:07:36+05:30 IST