రంగస్థల ‘సరస్వతి’

ABN , First Publish Date - 2021-01-27T06:49:18+05:30 IST

తెలుగు నాటకానికి బహుముఖాలుగా సేవలందించిన ప్రొఫెసర్‌ కోడూరిపాటి సరస్వతి రామారావు ఈనాటి కళాకారులకు ఆదర్శప్రాయుడు...

రంగస్థల ‘సరస్వతి’

తెలుగు నాటకానికి బహుముఖాలుగా సేవలందించిన ప్రొఫెసర్‌ కోడూరిపాటి సరస్వతి రామారావు ఈనాటి కళాకారులకు ఆదర్శప్రాయుడు. ఆయన నాటకరచయిత, నటుడు, దర్శకుడు. ఎన్నో విప్లవాత్మకమయిన రచనలు చేసారు. స్వీయదర్శకత్వం చేసి, తనే నటుడిగా పాల్గొని ఎన్నో నాటకాల్ని విజయవంతం చేసిన ఘనుడు. వీరు రచించిన ‘రంగూన్‌ రౌడి’ నాటకం అనేక ప్రదర్శనలను పూర్తి చేసుకుని అఖిలాంధ్ర ప్రేక్షకుల మన్ననలని అందుకుంది. నవరసాలను ఒకే పాత్రలో సృష్టించుకోవాలనే ఆలోచనతో కష్టపడి, కృషిచేసి, సాహసించి ‘సాని సంసారి’ అనే నాటకం రూపొందించారు. ఈ నాటకం బాగా విజయవంతమయినప్పటి నుంచి ఆయన ప్రేక్షకులకు ఆరాధ్యదైవమయ్యారు.


అదృష్టవశాత్తు ఆ మహానుభావుడు స్వయంగా రచించి దర్శకత్వం వహించిన ‘వీర పాండ్య కట్టబ్రహ్మన్న’ నాటకంలో నాకు మంచి పాత్ర వేసే అవకాశం దొరికింది. ఈ నాటకం ద్వారా అనేకమంది రంగస్థల నటులు సాంకేతిక నిపుణులు పరిచయమయ్యారు. మహారాజు సుపుత్రుడిగా అప్పటి బాలనటుడు, ఇప్పటి సినీ నేపథ్య గాయకుడు నాగూరుబాబు ఈ నాటకంలో మాతోబాటు ఒక పాత్ర వేశాడు.


ఈ నాటకంలో పాల్గొనడం ద్వారా, నేను ఆయన వ్యక్తిత్వాన్ని, దర్శకత్వ మెళకువలని గమనించేవాడ్ని. ఆయన ఇతర దర్శకుల్లాగాక తన నటనా శైలిని ప్రతి నటుడికి నేర్పించేవారు. నటుడి ముఖంలో కళ్ళు, ఎక్స్‌ప్రెషన్ ముఖ్యం అని చెప్పేవారు. స్వయంగా నటుడవడం వల్ల నటించి చూపించేవారు. ‘నటుడు భటుడు కాడు, నారాయణాంశ సంభూతుడు’ అని నటుల్ని గౌరవించేవారు. ఆంధ్రనాటక కళాపరిషత్‌లో ఆయన నటన చూసి ముగ్ధుడైన వంగర వెంకటసుబ్బయ్య గారు కోడూరుపాటి వారికి సాష్టాంగదండ ప్రణామం చెయ్యడం, ఆయన నటజీవితంలో మర్చిపోలేని రోజు. గుర్రం జాషువా గారు ఆయన్ని ‘సంగీత, సాహిత్య నటసార్వభౌమ’ బిరుదుతో గౌరవించారు. 1909లో జన్మించిన సరస్వతి రామారావుగారు 1982 జనవరి 28న నటరాజులో ఐక్యమైనారు. సంపూర్ణ జీవితాన్ని తెలుగు నాటకాభివృద్ధికి అంకితం చేసి, నాటకం కోసం అహర్నిశలు శ్రమించిన కళాపిపాసి ఫ్రొఫెసర్‌ కోడూరిపాటి ఇటువంటి మహనీయుల అనుభవాలే తెలుగు నాటకానికి దిక్సూచి.

పి.పాండురంగ

మాజీ సంచాలకులు, ఆకాశవాణి

(రేపు కోడూరిపాటి సరస్వతీరామారావు వర్ధంతి)

Updated Date - 2021-01-27T06:49:18+05:30 IST