అడ ఎస్బీఐలో చోరీ
ABN , First Publish Date - 2021-12-07T04:20:37+05:30 IST
జిల్లాలోని అడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు బ్యాంకు కిటికీల గ్రిల్స్ను గ్యాస్ కట్టర్ల సహాయంతో కత్తిరించి దొంగతనానికి పాల్పడ్డారు. బ్యాంకులోని కిటికీ గ్రిల్స్ను కత్తిరించి లోపలికి వెళ్లిన దుండగులు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి డీవీఆర్ను ఎత్తుకెళ్లారు.
- లాకర్ ధ్వంసం చేసి దొంగతనం
- రూ. 8 లక్షల అపహరణ
- సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ(ఆడ్మిన్) సుదీంధ్ర
ఆసిఫాబాద్రూరల్, డిసెంబరు 6: జిల్లాలోని అడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు బ్యాంకు కిటికీల గ్రిల్స్ను గ్యాస్ కట్టర్ల సహాయంతో కత్తిరించి దొంగతనానికి పాల్పడ్డారు. బ్యాంకులోని కిటికీ గ్రిల్స్ను కత్తిరించి లోపలికి వెళ్లిన దుండగులు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి డీవీఆర్ను ఎత్తుకెళ్లారు. బ్యాంకు లాకర్ ఓపెన్ కాకపోవడంతో గ్యాస్ కట్టర్ సహాయంతో కొంత భాగం కట్ చేసి చేతికి అందిన దాదాపు రూ.8లక్షల మేరకు దొంగలించారు. అలాగే బ్యాంకు ఎదుట ఉన్న గ్రామ పంచాయతీ భవనంలోని తలుపును బ్యాంకుకు సంబంధించిన గదులే అనుకొని తొలగించారు. అందు లోని బీర్వాలను ధ్వంసం చేశారు. సోమవారం తెల్ల వారుజామున బ్యాంకు తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన గ్రామపంచాయతీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని డాగ్స్క్వాడ్తో పరిసర ప్రాంతాల్లో గాలింపుచర్యలు చేపట్టారు. ఫింగర్ప్రింట్స్ బృందం చోరీకి సంబంధించిన ఆధారాలను సేకరించారు. ఎస్పీ(అడ్మిన్) వైవీఎస్ సుదీంద్ర చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చోరీ జరిగిన విధానాన్ని చూస్తే ప్రొఫెషనల్ దొంగలు లేదా అంతర్రాష్ట్ర ముఠా పని అయి ఉంటుందన్నారు. వారికోసం ఐదు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. తొందరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు. ఆయనవెంట డీఎస్పీ శ్రీనివాస్, సీఐ ఆశోక్, ఎస్సైలు గంగన్న, రాజేశ్వర్, ప్రవీణ్, డాగ్స్క్వాడ్, క్లూస్టీం, ఫింగర్ప్రింట్స్ బృందం, పోలీసులు పాల్గొన్నారు.