పెరియార్ డ్యామ్ గేట్లు ఎత్తివేతపై సుప్రీంకోర్టుకు కేరళ

ABN , First Publish Date - 2021-12-07T16:38:21+05:30 IST

తమిళనాడు ప్రభుత్వం ముళ్ల పెరియార్ డ్యామ్ గేట్లను రాత్రికి రాత్రి ఎత్తివేయడంతో కేరళ..

పెరియార్ డ్యామ్ గేట్లు ఎత్తివేతపై సుప్రీంకోర్టుకు కేరళ

తిరువనంతపురం: తమిళనాడు ప్రభుత్వం ముళ్ల పెరియార్ డ్యామ్ గేట్లను రాత్రికి రాత్రి ఎత్తివేయడంతో కేరళ సర్కార్ మరోసారి ఇరుకున పడింది. తమిళనాడు చర్యతో కేరళలోని ఇడుక్కి డ్యామ్‌ను తెరవాల్సిన అగత్యం కేరళ సర్కార్‌కు ఏర్పడింది. దీంతో ఇడుక్కి, పథనాంతిట్ట జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. తమిళనాడు చర్యపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు కేరళ సర్కార్ మంగళవారంనాడు పేర్కొంది.


రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరగడంతో సోమవారం రాత్రి ముల్లపెరియార్ డ్యామ్‌కు చెందిన తొమ్మిది గేట్లను తమిళనాడు ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో నీటి ఒత్తిడిని తగ్గించే క్రమంలో కేరళ సర్కార్ మంగళవారం తెల్లవారుజామున చెరుథోని డ్యామ్ షట్టర్లు తెరిచింది. రెండు జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. ముళ్లపెరియార్ డ్యామ్‌ గేట్లు ఎత్తేసినప్పటి నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిచేందుకు కేరళ జన వనరుల శాఖ మంత్రి రోషి అగస్టైన్ అక్కడే క్యాంప్ చేసారు. తమిళనాడు ప్రభుత్వం రాత్రికి రాత్రి ముళ్ల పెరియార్ డ్యామ్ గేట్లు ఎత్తివేయడం ఇదే మొదటిసారని, దీనిపై తమ ప్రభుత్వం ఆందోళన చెందుతోందని అగస్టైన్ తెలిపారు. తమిళనాడు చర్యను బాధ్యతారాహిత్యమైన చర్యగా ఆయన తప్పుపట్టారు.


శతాబ్దాల క్రితం నాటి ముళ్లపెరియార్ డ్యామ్‌లో నీటి మట్టం 141.90 ఫీట్లకు సోమవారంనాడు చేరుకుంది. దీంతో రాత్రి 7.45 గంటలకు తొమ్మిది గేట్లు ఎత్తేశారు. రాత్రి 10 గంటల తర్వాత మూడు గేట్లు తిరిగి మూసేశారు. తమిళనాడు చర్య కారణంగా 100కు పైగా కుటుంబాలను ఇడుక్కి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చినట్టు ఇడుక్కి జిల్లా అధికారులు తెలిపారు.



ముళ్లపెరియార్ డ్యామ్‌ను కేరళలోని ఇడుక్కి జిల్లాలో 1895లో నిర్మించారు. ఈ డ్యామ్‌ను తమిళనాడు ప్రభుత్వం తమ ఇరిగేషన్, విద్యుత్ అవసరాల కోసం ఆపరేట్ చేస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా కొత్త డ్యామ్ కట్టాలని కేరళ ప్రభుత్వం పట్టుబడుతుండగా, తమిళనాడు ప్రభుత్వం మాత్రం డ్యామ్ చాలా పటిష్టంగా ఉందంటూ కేరళ వాదనను తోసిపుచ్చుతోంది.

Updated Date - 2021-12-07T16:38:21+05:30 IST