warning bell : ఈ 12 నగరాలు నీటిలో మునిగే అవకాశం
ABN , First Publish Date - 2021-08-11T16:47:14+05:30 IST
ఈ శతాబ్దం చివరి నాటికి సముద్రనీటిమట్టం పెరగడం వల్ల భారత దేశంలోని 12 సముద్రతీర ప్రాంత నగరాలు ముంపునకు గురవుతాయని...
వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ తాజా నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ : ఈ శతాబ్దం చివరి నాటికి సముద్రనీటిమట్టం పెరగడం వల్ల భారత దేశంలోని 12 సముద్రతీర ప్రాంత నగరాలు ముంపునకు గురవుతాయని వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ (ఐపీసీసీ) వెల్లడించింది. ఈ శతాబ్దం చివరినాటికి ముంబై, చెన్నై, కొచ్చి, విశాఖపట్టణాలతో మొత్తం 12 సముద్ర తీర ప్రాంత నగరాలు దాదాపు మూడు అడుగుల నీటి అడుగున చేరవచ్చని ఐపీసీసీ తన నివేదికలో తెలిపింది. వాతావరణ మార్పులను అంచనా వేసే ఐపీసీసీ 12 సముద్రతీర నగరాల్లో సముద్ర నీటిమట్టాలు పెరగవచ్చని ఐపీసీసీ హెచ్చరించింది. ఉష్ణోగ్రత, మంచు కవరు, గ్రీన్ హౌస్ వాయు పదార్థాలు సముద్రనీటి మట్టాలను ప్రభావితం చేస్తుందని ఐపీసీసీ విశ్లేషించింది.
గతంలో 100 సవంత్సరాలకు ఒకసారి కనిపించే సముద్ర మట్టాల్లో మార్పులు 2050 నాటికి ప్రతీ 6 నుంచి 9 సంవత్సరాలకు జరగవచ్చని పేర్కొంది. సముద్ర తీరప్రాంతం కోతకు గురై నీటిమట్టం పెరుగుతూనే ఉంటుంది. 2006 నుంచి 2018 మధ్య ప్రపంచ సగటు సముద్ర మట్టం 3.7 మిల్లీమీటర్లు పెరిగింది.హిమనీనదాలు కరిగిపోవడంతోపాటు వాతావరణ మార్పుల వల్ల సముద్రతీర నీటిమట్టాలు పెరిగడం వల్ల ముంబై, మంగుళూరు, కొచ్చిన్, చెన్నై, విశాఖ పట్టణం, కండ్ల, ఓఖా, భావ్ నగర్, మర్ముగాం, పారాదీప్, ఖిదీర్ పూర్, ట్యూటీకోరిన్ నగరాల్లో మూడు అడుగుల మేర నీరు చేరే అవకాశముందని ఐపీసీసీ వివరించింది.