స్వాతంత్ర్యం వచ్చిన రెండో రోజే సీన్ రివర్స్.. పాక్ నుంచి ఆ గ్రామాలన్నీ భారత్‌లోకి.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-08-18T19:41:28+05:30 IST

ఆగస్టు 15న భారతదేశం అంతటా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు మిన్నంటాయి. ప్రధాని, రాష్ట్రపతి వంటి ప్రముఖులు త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు.

స్వాతంత్ర్యం వచ్చిన రెండో రోజే సీన్ రివర్స్.. పాక్ నుంచి ఆ గ్రామాలన్నీ భారత్‌లోకి.. అసలేం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: 1947 ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిందని దేశం మొత్తం పండగ చేసుకుంటోంది. కానీ ఆ గ్రామాలు మాత్రం టెన్షన్ టెన్షన్‌గా గడిపాయి. దీనికి కారణం ఆ గ్రామాలన్నీ తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో ఉన్నాయి. తాము భారత్‌లో ఉంటామని వాళ్లంతా అనుకున్నారు. కానీ చివరకు సీన్ రివర్స్ అయింది. వాళ్లను పాకిస్తాన్‌లో కలిపేశారు. ఇదంతా ఆంగ్లేయులు చేసిన చిన్న పొరపాటు వల్ల జరిగింది. ఆ తర్వాత రెండ్రోజులకు ఈ పొరపాటును గుర్తించడంతో ఆ గ్రామాలను మళ్లీ భారత్‌లో కలిపారు. అప్పుడుగానీ ఆ గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకోలేదు.


ఆగస్టు 15న భారతదేశం అంతటా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు మిన్నంటాయి. ప్రధాని, రాష్ట్రపతి వంటి ప్రముఖులు త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. దేశం మొత్తం అలనాటి స్వాతంత్ర్య పోరాటాన్ని గుర్తుచేసుకుంది. అయితే భారతదేశం అంతటా స్వాతంత్ర్య వేడుకలు జరిగిన రెండ్రోజుల తర్వాత అంటే.. ఆగస్టు 18న భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో స్వతంత్ర వేడుకలు జరుగుతాయని మీకు తెలుసా? ఇక్కడి ప్రభుత్వాలు ఈ వేడుకలను గుర్తించకపోయినా.. ప్రజలు మాత్రం ఆగస్టు 18నే స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటారు. జెండాలు ఎగరేస్తారు. ఈ ప్రాంతాలు పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్నాయి. బెంగాల్‌లోని నదియా, నార్త్ 24 పరగణాల్లోని పలు గ్రామాల్లో ఈ దృశ్యం ప్రతి సంవత్సరం కనిపిస్తుంది. దీనికి కారణం అప్పుడెప్పుడో బ్రిటిష్ వారు చేసిన పొరపాటు.


బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం నుంచి పాకిస్తాన్‌ విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాకిస్తాన్‌కు భారతదేశానికి తూర్పున, అలాగే పశ్చిమాన రెండు భూభాగాలను కట్టబెట్టారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం తయారు చేసిన మ్యాప్స్‌లో జరిగిన పొరపాటు వల్ల కొన్ని భారతీయ గ్రామాలు తూర్పు పాకిస్తాన్‌(ప్రస్తుత బంగ్లాదేశ్)లో కలిసిపోయాయి. హిందూ జనాభా ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాలు తమను పాకిస్తాన్‌లో కలపడాన్ని వ్యతిరేకించాయి. ఈ పొరపాటును గుర్తించడానికి రెండు రోజులు పట్టింది. ఆ రెండ్రోజులపాటు ఈ ప్రాంతాలన్నీ తూర్పు పాకిస్తాన్ భూభాగాలుగా ఉన్నాయి. ఆ తర్వాత ఆగస్టు 17 రాత్రి వీటిని భారత భూభాగాలుగా ప్రకటించటం జరిగింది. అప్పటి ఈ ఘటనలకు గుర్తుగానే ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఆగస్టు 18న స్వాతంత్ర్య వేడుకలు జరపుకోవడం జరుగుతోందట.

Updated Date - 2021-08-18T19:41:28+05:30 IST