రూ. 45 వేల ఫోన్ చోరీ చేశాడు... ఆపరేట్ చేయలేక తిరిగిచ్చేశాడు!

ABN , First Publish Date - 2020-09-08T15:57:37+05:30 IST

వింత దొంగతనాల గురించి అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. ఇలాంటి మరో ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. ఒక దొంగ రూ. 45 వేల రూపాలయ విలువైన ఫోన్ చోరీ చేశాడు. అయితే దానిని ఆపరేట్ చేయడం...

రూ. 45 వేల ఫోన్ చోరీ చేశాడు... ఆపరేట్ చేయలేక తిరిగిచ్చేశాడు!

కోల్‌కతా: వింత దొంగతనాల గురించి అప్పుడప్పుడు వింటూనే ఉంటాం. ఇలాంటి మరో ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. ఒక దొంగ రూ. 45 వేల రూపాలయ విలువైన ఫోన్ చోరీ చేశాడు. అయితే దానిని ఆపరేట్ చేయడం చేతకాక పోవడంతో, ఆ ఫోనును తిరిగి దానిని పోగొట్టుకున్న వ్యక్తికి ఇచ్చేశాడు. మీడియాకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉదంతం పశ్చిమ బెంగాల్‌లోని వర్థమాన్ జిల్లాలో చోటుచేసుకుంది. జమాల్‌పూర్‌లో గల ఒక మిఠాయి దుకాణంలో ఒక వ్యక్తి రూ. 45 వేల విలువైన ఫోనును మరచిపోయారు. ఈ ఫోనును 22 ఏళ్ల యువకుడు చోరీ చేశాడు. ఇంతలో తన ఫోను పోయిందంటూ, ఆ ఫోను పోగొట్టుకున్న వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  



తరువాత ఆ ఫోనుకు కాల్ చేశాడు. దీంతో ఫోను చోరీ చేసిన యువకుడు ఆ కాల్ రిసీవ్ చేసుకుని, ఆ ఫోనును తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఫోనును తాను ఆపరేట్ చేయలేకపోతున్నానని, అందుకే వాపస్ చేయాలనుకుంటున్నానని చెప్పాడు. దీంతో ఆ ఫోనును పోగొట్టుకున్న వ్యక్తి దానిని దొంగిలించిన యువకుని ఇంటికి వెళ్లి, తన ఫోనును తీసుకున్నాడు. ఈ సమయంలో పోలీసుల కూడా ఫోన్ చోరీ చేసిన యువకుని ఇంటికి వచ్చారు. అయితే ఫోను పోగొట్టుకున్న వ్యక్తి వినతి మేరకు పోలీసులు ఫోను చోరీచేసిన యువకునిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా విడిచిపెట్టేశారు.

Updated Date - 2020-09-08T15:57:37+05:30 IST