అనంతపురం : సినీ పక్కీలో చోరీకి ప్లాన్ చేశాడు కానీ..

ABN , First Publish Date - 2020-05-23T02:56:33+05:30 IST

అసలే లాక్ డౌన్‌.. జనాలంతా ఎవరి పనుల్లో వాళ్లుంటారు..

అనంతపురం : సినీ పక్కీలో చోరీకి ప్లాన్ చేశాడు కానీ..

అనంతపురం : అసలే లాక్ డౌన్‌.. జనాలంతా ఎవరి పనుల్లో వాళ్లుంటారు.. ఇక మన పని మనం కానిచ్చేయని ఓ దొంగ సినీ పక్కీలో ప్లాన్ చేశాడు. అది కూడా ఏకంగా గవర్నమెంట్ బస్సే కొట్టేయాలని వ్యూహం రచించాడు. బస్సులు కూడా తిరుగుతున్నాయ్ కదా ఏదో ఒకటి చెప్పి.. అవసరమైతే డ్రైవర్ అవతారం ఎత్తొచ్చని అనుకున్నాడు. ఎలాగో డిపో నుంచి బయటికి తెచ్చేస్తే కర్ణాటకకు చెక్కేయొచ్చు అనుకున్నాడు. కానీ సీన్ మొత్తం రివర్స్ అవ్వడంతో అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ధర్మవరంలో చోటు చేసుకుంది.


అసలేం జరిగింది..!?

అనంతపురం జిల్లా ధర్మవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును (ఏపీ02జెడ్‌552) కర్ణాటకకు చెందిన పూజా బిల్లి ఖాన్ చోరీకి పాల్పడ్డాడు. ధర్మవరం ఆర్టీసీ డిపోలో అనంతపురంకు వెళ్లే బస్సును చాకచక్యంగా సినీ పక్కీలో చోరీ చేశాడు. అనంతరం సొంత రాష్ట్రం బెంగళూరుకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలో బస్సును అపహరించి డిపో నుంచి బయల్దేరాడు. అయితే కొత్త ముఖం కావడంతో వెంటనే గమనించిన డ్రైవర్ ద్విచక్ర వాహనంలో వెంబడించే 100 సమాచారం ఇచ్చాడు. 


ఇలా బుక్కయ్యాడు..!?

హుటాహుటిన పెనుకొండ మండలం అమ్మవారిపల్లి వద్ద ఉన్న ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గణేష్, సిబ్బంది రంగంలోకి దిగారు. బస్సును.. దొంగను కూడా చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం అతన్ని విచారించి ధర్మవరం పోలీసులకు అప్పజెప్పారు. అయితే పోలీసుల విచారణలో ఏం చెప్పాడు..? ఎందుకు బస్సు తీసుకెళ్లాల్సి వచ్చింది..? ఇంటికెళ్లేందుకు అతనితో పాటు ఇంకా వలసకూలీలు ఇబ్బంది పడుతుంటంతో ఇలా చేశాడా..? లేకుంటే అతను ఘరానా దొంగనా..? ఆ దొంగకు ఏం శిక్ష వేయబోతున్నారనే దానిపై సమాచారం తెలియరాలేదు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరిం త సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-05-23T02:56:33+05:30 IST