దేవుడి పేరుతో దొంగోట్లు వైసీపీకే సాధ్యం
ABN , First Publish Date - 2021-04-19T06:55:49+05:30 IST
ఉప ఎన్నికలో దేవుడి పేరుతోనూ దొంగోట్లు వేయించిన ఘనత వైసీపీకే చెల్లిందని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్ విమర్శించారు.
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్
తిరుపతి(తిలక్రోడ్డు) ఏప్రిల్ 18: ఉప ఎన్నికలో దేవుడి పేరుతోనూ దొంగోట్లు వేయించిన ఘనత వైసీపీకే చెల్లిందని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్ విమర్శించారు. ఆదివారం తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని వైసీపీవారు ఖూనీ చేశారన్నారు. ఇది బైపోల్కాదు.. బస్సుల పోల్ అని పేర్కొన్నారు. సీఎం జగన్ చెప్పినట్లు వైసీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు దేశం మొత్తం చూసేలా దొంగోట్లు వేయించి.. నిజమైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా చేశారన్నారు. మంత్రి ఆధ్వర్యంలో నకిలీ ఓటరు కార్డులను వేలాదిగా తయారు చేయించడం సిగ్గుచేటన్నారు. రాష్ర్టాన్ని కూడా నకిలీగా తయారు చేయగల సత్తా వైసీపీ ప్రభుత్వానికి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతునొక్కడం, పోలీసులేమో అరెస్టులు చేయడం దురదృష్టకరమన్నారు. ఇకనైనా రీపోల్ నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.