మూడోరోజు 473 మందికి టీకా
ABN , First Publish Date - 2021-01-19T06:36:07+05:30 IST
జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మూడోరోజు సోమవారం జిల్లావ్యాప్తంగా 473 మంది ఆరోగ్య సిబ్బందికి టీకా ఇచ్చారు.
విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మూడోరోజు సోమవారం జిల్లావ్యాప్తంగా 473 మంది ఆరోగ్య సిబ్బందికి టీకా ఇచ్చారు. వాస్తవానికి సోమవారం 824 మందికి వ్యాక్సిన్ వేయాలనేది లక్ష్యం కాగా, వారిలో 473 మంది మాత్రమే టీకా తీసుకునేందుకు ముందుకు వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ శనివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలివిడతగా 30 సెషన్ సైట్లలో ఒక్కో సెంటరులో 100 మంది చొప్పున మొత్తం 3వేల మందికి టీకా అందించాలనేది లక్ష్యం కాగా, చాలామంది ముందుకు రాకపోవడంతో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ అనుకున్న విధంగా ముందుకు సాగలేదు. 2,027 మందికే టీకా అందించగలిగారు. రెండోరోజు ఆదివారం సెలవు దినమైనా లక్ష్యం పూర్తి చేయాలనే ఉద్దేశంతో అన్ని సెషన్ సైట్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించినప్పటికీ కేవలం 14 సెంటర్లలో 485 మందే టీకా తీసుకునేందుకు ముందుకు వచ్చారు. మిగిలిన 824 మందికి మూడోరోజు సోమవారం టీకాలు వేయాల్సి ఉండగా, వారిలో 473 మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. 351 మంది ముందుకు రాలేదు.