భారత్ వ్యాక్సినేషన్పై బిల్ గేట్స్ ప్రశంసలు
ABN , First Publish Date - 2021-10-22T19:39:51+05:30 IST
100 కోట్ల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్ను ప్రజలకు ఇచ్చి
న్యూఢిల్లీ : 100 కోట్ల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్ను ప్రజలకు ఇచ్చి రికార్డు సృష్టించిన భారత దేశంపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ఈ విజయం దేశ శక్తి, సామర్థ్యాలకు నిదర్శనమని చెప్పారు. అక్టోబరు 21 ఉదయం 10 గంటలకు 100 కోట్ల మోతాదులను ప్రజలకు ఇచ్చి, చరిత్ర సృష్టించినట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆయన భారత్ను అభినందించారు.
బిల్ గేట్స్ శుక్రవారం ఇచ్చిన ట్వీట్లో, భారత దేశం 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చిందని, ఇది ఆ దేశానికిగల నవ కల్పన శక్తి, భారీ స్థాయిలో తయారీ సామర్థ్యాలకు, కొవిన్ సాయంతో లక్షలాది మంది హెల్త్ వర్కర్ల కృషికి నిదర్శనమని తెలిపారు.
బిల్ గేట్స్ ఈ ట్వీట్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)లకు ట్యాగ్ చేశారు.
100 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇవ్వడంపై మోదీ మాట్లాడుతూ, మన దేశానికి కోవిడ్-19పై పోరాటానికి బలమైన రక్షణ కవచం లభించిందన్నారు.