రాత్రి వేళల్లో డ్రోన్లతో పాక్ చేస్తున్న దారుణం
ABN , First Publish Date - 2020-09-23T02:12:20+05:30 IST
అడ్డదారులు తొక్కడంలో పాకిస్థాన్ కొత్త పద్ధతులు అవలంబిస్తోంది. జమ్మూ-కశ్మీరులోని ఉగ్రవాదులకు ఏకే-47 వంటి ఆయుధాలను అందించేందుకు
న్యూఢిల్లీ : అడ్డదారులు తొక్కడంలో పాకిస్థాన్ కొత్త పద్ధతులు అవలంబిస్తోంది. జమ్మూ-కశ్మీరులోని ఉగ్రవాదులకు ఏకే-47 వంటి ఆయుధాలను అందించేందుకు డ్రోన్లను ఉపయోగిస్తోంది. రాత్రివేళల్లో దొంగచాటుగా ఈ దుస్తంత్రాన్ని అమలు చేస్తోంది.
జమ్మూ-కశ్మీరు పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం అఖ్నూర్ సెక్టర్లోని ఓ గ్రామంలో సోమవారం రాత్రి అజాల్ట్ రైఫిల్స్, ఓ పిస్టల్ దొరికాయి. వీటిని ఉగ్రవాదులకు అందజేయడం కోసం డ్రోన్ల ద్వారా రాత్రి వేళల్లో వీటిని పాకిస్థాన్ జారవిడుస్తోంది. సాక్ష్యాధారాలనుబట్టి ఈ సంఘటన వెనుక జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పాత్ర కనిపిస్తోంది.
పుల్వామా సహా అనేక ఉగ్రవాద దాడుల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పాత్ర ఉందన్న సంగతి తెలిసిందే.
స్పష్టమైన సమాచారం అందిన తర్వాత జమ్మూ-కశ్మీరు పోలీసులు జాద్ సోహాల్ గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. రెండు ఏకే అజాల్ట్ రైఫిల్స్, ఒక పిస్టల్, మూడు ఏకే మ్యాగజైన్స్ , 90 రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు కన్సైన్మెంట్ల ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది.