ఈసారి సాదాసీదాగా నేవీ డే
ABN , First Publish Date - 2020-11-26T06:07:22+05:30 IST
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది నౌకాదళ దినోత్సవాన్ని సాదాసీదాగా నిర్వహించాలని సంబంధిత వర్గాలు నిర్ణయించాయి.
4న బీచ్లో ప్రదర్శన రద్దు
విశాఖపట్నం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో ఈ ఏడాది నౌకాదళ దినోత్సవాన్ని సాదాసీదాగా నిర్వహించాలని సంబంధిత వర్గాలు నిర్ణయించాయి. ఏటా డిసెంబరు 4న నేవీ డే సందర్భంగా విశాఖపట్నంలో తూర్పు నౌకాదళం అనేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పాకిస్తాన్పై సాధించిన విజయానికి చిహ్నంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా డిసెంబరు 4న ఆర్కే బీచ్లో సాహస విన్యాసాలు ప్రదర్శిస్తుం టుంది. దీనికి వారం ముందు నుంచి రిహార్సల్స్ చేస్తుంది. ఆరోజు ప్రదర్శన చూడడానికి వేలాది మంది ప్రజలు బీచ్కు తరలివెళతారు. అయితే కొవిడ్ కారణంగా ఈసారి ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. అయితే యథా ప్రకారం ఆ రోజు ఉదయం బీచ్ రోడ్లో అమరవీరుల స్మృతి చిహ్నం వద్ద తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్అడ్మిరల్ అతుల్కుమార్, కలెక్టర్ వినయ్చంద్, సీపీ నివాళులు అర్పిస్తారు. ఇవి కాకుండా రక్తదాన శిబిరాలు, మొక్కల పెంపకం, బీచ్ క్లీనింగ్ వంటి కార్యక్రమాలను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తున్నట్టు నేవీ వర్గాలు తెలిపాయి.