పరిటాల శ్రీరామ్కు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
ABN , First Publish Date - 2021-01-19T18:08:10+05:30 IST
వార్నింగ్ ఇస్తూ మాట్లాడిన విషయం విదితమే.
అనంతపురం : అనంత జిల్లా రాప్తాడు వేదికగా వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి.. టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ ‘టెండర్లు’ విషయంలో వార్నింగ్ ఇస్తూ మాట్లాడిన విషయం విదితమే. శ్రీరామ్ వ్యాఖ్యలపై రాప్తాడులో మీడియా మీట్ నిర్వహించిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అనంతపురం జిల్లాకు కియా ఫ్యాక్టరీ రాబోతుందని తెలుసుకుని పరిటాల ఫ్యామిలీ అక్కడ భూ లావాదేవీలు చేసిందని ఆరోపణలు చేశారు. పది ఎకరాలు భూములు వున్న మీరు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారు..? అని తోపుదుర్తి ప్రశ్నించారు. దాతల ఆర్థిక సహాయంతో చేసిన పనులకు పరిటాల రవి జ్ఞాపకార్థం అని పెట్టుకున్నారని విమర్శలు గుప్పించారు.
మీరు ఐటెం గాళ్ళు!
అంతటితో ఆగని ఆయన.. ‘మీరు ఐటెం గాళ్ళు.. సమాజానికి చేసిందేమీ లేదు. నిజంగా అభివృద్ధి చేసివుంటే 25 వేల మెజార్టీతో ఎందుకు ఓడిపోయారు..?. పేరూరు ఆయకట్టుకు నీళ్లు ఎందుకు తీసుకురాలేకపోయారు..?. పరిటాల రవి భయాన్ని ఎన్ క్యాష్ చేసుకుంటున్నారు. నా గురించి మాట్లాడేందుకు నీకు వున్న యోగ్యత ఏమిటి..?. మీరు లా మేకర్స్ కాదు.. లా బ్రేకర్స్. తప్పుడు ప్రచారాలు.. తప్పుడు కూతలు పత్రికలలో రాయించారు. సూడో నక్సలైట్లను అడ్డుపెట్టుకుని కిరాయి హంతకులతో ఖూనీలు చేయించారు’ అని తోపుదుర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అందరికీ తెలుసు..!
‘కియా పరిశ్రమ వస్తుందని తెలిసి అక్కడ రెండు వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారు. వాటిపై మరోసారి మాట్లాడతా. మీ వ్యాపారాలు, గన్మెన్ల కోసం ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నారో అందరికీ తెలుసు. జాకీ పరిశ్రమ లాంటి అమ్మ మొగుడు లాంటి సంస్థలు తీసుకొస్తాం. మీ తాత ఎల్ నారాయణ చౌదరి దగ్గర డబ్బులు ఆశిస్తామా..?. మేం (వైసీపీ) అభివృద్ధి చేస్తున్నాం. మీలాగా దోచుకోవాలని దాచుకోవాలని కాదు’ అని ప్రకాష్రెడ్డి వ్యాఖ్యానించారు. తోపుదుర్తి వ్యాఖ్యలపై శ్రీరామ్ ఎలా రియాక్ట్ అవుతారా..? అని నియోజకవర్గంలోని కార్యకర్తలు, పరిటాల వీరాభిమానులు ఎదురుచూస్తున్నారు.