ఆ అనుమతులు పనికిరావు
ABN , First Publish Date - 2020-06-03T10:20:54+05:30 IST
రెల్లివలస పంచాయతీ పరిధి సర్వే నెం.1లోగల కొండ నుంచి గ్రావెల్ తరలింపుపై చోటుచేసుకున్న వివాదం ఓ కొలిక్కి వచ్చింది.
గ్రావెల్ తరలింపు వ్యవహారంపై స్పష్టత ఇచ్చిన తహసీల్దార్
పూసపాటిరేగ, జూన్ 2: రెల్లివలస పంచాయతీ పరిధి సర్వే నెం.1లోగల కొండ నుంచి గ్రావెల్ తరలింపుపై చోటుచేసుకున్న వివాదం ఓ కొలిక్కి వచ్చింది. ఇటీవల ఈ కొండ నుంచి కొందరు గ్రావెల్ తరలిస్తుండగా మాజీ ఎమ్మెల్యే పతివాడ కుమారుడు తమ్మినాయుడుతో పాటు స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకుని, వాహనాలను నిలుపుదల చేశారు. స్థానిక ఎస్ఐ బాలాజీరావు అక్కడ కు చేరుకుని, వాహనదారులను ఆరా తీయగా, వారి దగ్గర ఉన్న అనుమతి పత్రాలను చూపించారు. దీంతో ఎస్ఐ.. వాహనాలను విడిచిపెట్టాలని, లేదంటే కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని టీడీపీ నాయకులకు హెచ్చరించారు. అలాగే ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు తేల్చాల్సి ఉందన్నారు.
దీంతో టీడీపీ నాయకులు ఆ వాహనాలను అక్కడి నుంచి విడిచిపెట్టారు. ఈనేపథ్యంలో స్థానిక తహసీల్దార్ నీలకంఠారావు ఈ విషయంపై మంగళవారం స్పష్టతని చ్చారు. వాహనదారుల వద్ద ఉన్న అనుమతి పత్రాలు జనవరి నెలలో రెల్లివ లసలోని లేఅవుట్లో అంతర్గత రోడ్లకుగాను అప్పటి కలెక్టర్ ఆదేశాలమేరకు అందజేసినవని తేల్చిచెప్పారు. ప్రస్తుతం అవి చెల్లవని స్పష్టం చేశారు. వెంటనే ఆ వాహనాలను సీజ్ చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.