స్వీయానుభూతితో అభివ్యక్తం చేయగలిగిన వారే యాత్రా చరిత్ర కారులవుతారు

ABN , First Publish Date - 2021-03-22T06:49:22+05:30 IST

ప్రవృత్తే పరిశోధనగా గల రిటైర్డ్‌ తెలుగు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ మచ్చహరిదాసు. ‘‘తెలుగులో యాత్రాచరిత్రలు’’ రెండు మూడుకంటె ఎక్కువ లేవు అని...

స్వీయానుభూతితో అభివ్యక్తం చేయగలిగిన వారే యాత్రా చరిత్ర కారులవుతారు

ప్రవృత్తే పరిశోధనగా గల రిటైర్డ్‌ తెలుగు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ మచ్చహరిదాసు. ‘‘తెలుగులో యాత్రాచరిత్రలు’’ రెండు మూడుకంటె ఎక్కువ లేవు అని నాటి కాలపు సాహితీ వేత్తలు అంటే, వారి ముందు డెబ్బయి యాత్రాచరిత్రలను పరచి ‘‘తెలుగులో యాత్రాచరిత్రలు’’ అనే అంశంపై మొదటిగా పరిశోధన చేసి, ‘‘యాత్రాచరిత్రలు’’ను సాహిత్య ప్రక్రియగా స్థిర పరిచారు. పరిశోధన పూర్తయ్యాక నూటాయాభై యాత్రాచరిత్ర గ్రంథాలను ేసకరించారు. ‘‘అష్టాదశ’’ గ్రంథంలో పలు యాత్రా సాహిత్య వ్యాసాలను ప్రక టించారు. ‘‘యేనుగుల వీరస్వామి జీవిత చరిత్ర’’ రచించి తన నిబద్థతను చాటుకు న్నారు. పరిశోధనా తృష్ణ ‘‘సుమతి’’ పై ప్రసరించింది. ఫలితంగా తథ్యము సుమతి అనే మకుటాన్ని గ్రంధనామంగా గ్రహించి ‘‘తధ్యము సుమతి’’ వెలువరించారు. అదే పరివర్థిత ముద్రణలో తంజావూరులో దొరికిన తాళపత్ర ప్రతులలోని పద్యాలను యధాతథంగా అచ్చువేయించారు. కొమ్మల్లో దాగుండి పరిమళాల్ని వెదజల్లే కుసుమంగా కరీంనగర్‌ నుండి తనదైన శైలిలో సాహితీ ేసద్యం చేస్తున్నారు.


యాత్రా చరిత్ర రచయితల శాతం అత్యల్పంగా వుండడానికి కారణమేమిటి?

యాత్రా చరిత్ర కారులకు, మిగతా రచయితలకు మౌలికమైన తేడా ఒకటుంది. విదేశ యాత్రా సాహిత్యంతో పోలిేస్త, మన తెలుగు యాత్రా సాహిత్యం ఇంకా కౌమారదశలోనే ఉంది. మనవాళ్లు యాత్రలు చేయరని కాదు కాని, చేేసవారిలో ఎక్కువ శాతం కేవలం భ్రమణ మాత్రులుగానే మిగిలిపోవడం ముఖ్య కారణం. చాల తక్కువమంది యాత్రను ఆంతరికంగా అనుభవించి, గాఢ పరిశీలనతో ఆ యాత్రా విశేషాలను లేఖన బద్ధం చేసి ప్రజల కందిస్తారు. ఆ విధంగా స్వీయానుభూతితో అభివ్యక్తం చేయగలిగిన వారే యాత్రా చరిత్ర కారులవుతారు. యాత్ర చేయాలంటే ఆ రచయిత సమయాన్ని, డబ్బును వెచ్చించగలగాలి. దైహికంగా బాగుండాలి. వ్యయ ప్రయాసలతో కూడినది కనుక యాత్రారచన విరివిగా జరుగడం లేదు. కవిత్వం, కథలు, నాటకాలు, వ్యాసాలు రాయడానికి బయటికి వెళ్లాల్సిన అవసరం లేదుకదా!


హైటెక్‌ ప్రయాణాలు యాత్రా రచనకు ఎంత వరకు దోహద పడతాయి?

కాళ్ళు లేని వాడు రెక్కలు తెగిన పక్షి. ప్రయాణ సౌకర్యాలు లేని పూర్వకాలంలో మనిషి ఎక్కడికి వెళ్ళాలన్నా కాలినడకే శరణ్యం. కాబట్టి సుదీర్ఘ యాత్రల్లో వారికి లోక పరిశీలనకు, ప్రజలతో మమేకం కావడానికి అవకాశం దొరికేది. అనుభూతి ప్రధానంగా ఆ యాత్ర కొనసాగేది. ఈ గ్లోబలైజేషన్‌ కాలంలో వాహన సౌకర్యాలు పెరిగి, సుఖ వంతంగా ప్రపంచాన్ని కొన్ని రోజుల్లోనే చుట్టి రావడానికి వీలు కలుగుతున్నది. ఐతే ఈ ప్రయాణ వేగం వల్ల యాత్రా వివరాలు తగ్గిపోయి, యాత్రాగమ్యానికే అధిక ప్రాధాన్యం లభిస్తున్నది. విమాన యాత్ర అసలు యాత్రే కాదంటాడు విస్తృత యాత్రికుడు రాహుల్‌ సాంకృత్యాయన్‌. ఇప్పటి విదేశీ యాత్రలన్నీ ఆ రకంగా జరుగుతున్నవే. ఐనా ఆయాదేశాల్లో పర్యటిస్తూ ఆధునిక యాత్రా చరిత్రకారులు అక్కడి విశేషాలను ఆసక్తికరంగా మలచి చూపుతూ యాత్రా సాహిత్యాభివృద్థికి తమ వంతు కృషి చేస్తూనే వున్నారు.


ప్రజం నోళ్ళల్లో నానుతున్న సుమతి పద్యాలనే మీరు కొత్తగా కనుక్కోవడమేమిటి? ఆ విషయం కాస్త వివరించండి?

పరిశోధన అంటేనే ఎవరికీ అంతదాకా తెలియని విషయాల్ని ముందుగా కనుక్కొని చెప్పడం. అదివరకు లేదా? అంటే ఎవరిదృష్టి దాని మీద పడకుండా ఉన్నదన్న మాటే కాని అసలు లేనిదని కాదు. శతకమంటే వంద. రచనలో 108 పద్యాలుండాలి. కాని బ్రౌన్‌ ేసకరించిన పద్యాలు 150. తంజావూరు తాళ పత్రప్రతుల్లోవి వరుసగా 105 మరియు 83. లక్ష్మీపతి ప్రతిలో 50 పద్యాలు, వీటన్నిటినీ సరిపోల్చి చూడగా నేనిదివరకు చెప్పినట్లు 56 కొత్త పద్యాలకు బదులు 55 తేలుతున్నాయి. అంటే 150 బ్రౌన్‌ పద్యాలతో కలుపుకొని (150+55) మొత్తం సుమతి పద్యాల సంఖ్య 205 అవుతున్నది. ఐతే వీటిలో ఎక్కడా కనిపించకుండా కేవలం అచ్చు ప్రతుల్లో మాత్రమే (అకాడమీ 1966తో కలుపుకొని) సుమతి పద్యాలు 3 కొత్తవి కనిపిస్తున్నాయి. శ్రీరాముని దయచేతను..., అడిగిన జీతం బియ్యని...., వేసరపు జాతి కానీ అనేవి. చివరిది ప్రసిద్థ పద్యం కానేకాదు. ఇక మిగతా రెండు మీరన్నట్లు ప్రజల నోళ్ళల్లో నానుతున్న పద్యాలు. ఈ రెండు పద్యాలు సుమతి బాణీలో ఉన్నప్పటికీ ప్రాచీన ప్రతుల్లో లేని కారణాన వీటిని ప్రక్షిప్త పద్యాలుగానే పేర్కొనవలసి వస్తున్నది.


సుమతీ శతక కాలము, కర్తృత్వముపై చర్చ ఉంది. స్పష్టం చేయండి?

సుమతీకారుని కాలం గురించీ, కర్తృత్వం గురించీ దాదాపు శతాబ్ద కాలంగా చర్చలు కొనసాగుతూనే వున్నాయి. కాని ఇంతవరకు ఏ విషయంలోను ఖచ్చితమైన సమాచారం దొరకలేదు. ముఖ్యంగా కాలం విషయంలో పండితులు పలువిధాల ఆలోచనలు చేసారు. అందులో సింహభాగం సుమతీ కారుని కాలాన్ని క్రీశ్రీశ్రీశశ్రీశ్రీ 1261 ప్రాంతంగా (13వ శతాబ్ది) నిర్దారించారు. అలాగే కర్తృత్వం విషయంలో కూడ అనేక వాదోపవాదాలు జరిగాయి. చివరకు బద్దెన విషయం గానే సందిగ్థంగానైనా మొగ్గు చూపారు. కొంతమంది సుమతి శతకకర్త భీమన కూడ కావచ్చునని కొన్ని ఆధారాలు చూపారు. జైన సాహిత్యంలో సుమతి పేరు గల జైన భిక్షువుగురించి కొంత ఆరా తీస్తే బహుశా ఏదైనా కొత్త దారి దొరక వచ్చునని పండితుల ఊహ. ఏదేమైనా బద్దెన, భీమనల కర్తృత్వాలు ఇప్పటికీ సవాలు చెయ్యదగినవే. బద్దెన కర్తృత్వాన్నీ, కాలాన్ని (13వ శతాబ్ది) ఖండించే బలవత్తర సాక్ష్యాలు, సాధనాలు లభించే వరకు వేచి చూడవలసిందేనని నా అభిప్రాయం.

బి.వి.ఎన్‌.స్వామి

Updated Date - 2021-03-22T06:49:22+05:30 IST