ఐదు రోజుల్లోనే వెయ్యి కోట్లు!

ABN , First Publish Date - 2020-07-05T08:04:31+05:30 IST

హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారన్న ప్రచారం జరగడంతో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. జూన్‌ 26 నుంచి 30 మధ్య రూ.973.61

ఐదు రోజుల్లోనే వెయ్యి కోట్లు!

  • లాక్‌డౌన్‌ ప్రచారంతో మద్యం అమ్మకాల్లో జోష్‌ 
  • జూన్‌ చివరి ఐదు రోజుల్లో రూ.973 కోట్ల అమ్మకాలు
  • ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4,997 కోట్ల రాబడి

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారన్న ప్రచారం జరగడంతో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. జూన్‌ 26 నుంచి 30 మధ్య రూ.973.61 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. జూలై 1 నుంచి లాక్‌డౌన్‌ విధిస్తే, ఎక్కడ షాపులు మూతపడతాయేమోనన్న కంగారుతో మందుబాబులు పెద్ద మొత్తంలతో మద్యం కొని నిల్వ చేసుకున్నారు. మొత్తమ్మీద  కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాలు బాసటగా నిలుస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు, జీఎ్‌సటీ రాబడుల కంటే మద్యం విక్రయాలే ఎక్కువ ఊరట కలిగిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.4997.81 కోట్ల రాబడి సమకూరింది. జూన్‌ నెలాఖర్లో అమ్మకాలు గణనీయంగా పెరగ్గా ఈ నెల 1 నుంచి 4 వరకు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే అమ్మకాలున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత మే 6 నుంచి 31 వరకు సాగిన విక్రయాల్లో రూ.1864 కోట్ల రాబడి వచ్చింది. జూన్‌లో రూ.1955 కోట్ల ఆదాయం సమకూరింది.


హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతుండడంతో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో మద్యం దొరక్క ఎదుర్కొన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మందు బాబులు మద్యం కొనుగోలు కోసం ఎగబడ్డారు. సాధారణ రోజుల్లో బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మద్యం డిపోల నుంచి వైన్‌ షాపు ఓనర్లు రోజుకు రూ.70-75 కోట్ల మద్యం, బీరును లిఫ్ట్‌ చేస్తుంటారు. కానీ జూన్‌ 26 నుంచి 30వ తేదీ వరకు 27న మినహా మిగతా నాలుగు రోజుల్లో రూ.150 కోట్లకు పైగానే విక్రయాలు సాగాయి. ఇక జూలై 1 నుంచి 4 వరకు కూడా విక్రయాలు బాగానే ఉన్నాయి. ఈ రోజుల్లో ప్రతి రోజూ రూ.75 కోట్లకు పైగానే విక్రయాలు సాగడం గమనార్హం.

Updated Date - 2020-07-05T08:04:31+05:30 IST