పాఠశాలలు వెలవెల
ABN , First Publish Date - 2022-01-18T05:44:28+05:30 IST
కొవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం పాఠశాలలను తెరవాలని తీసుకున్న నిర్ణయం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన రేపుతున్నది.
కరోనా నేపథ్యంలో అంతంతమాత్రంగానే విద్యార్థుల హాజరు
స్కూళ్లు తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రుల అసంతృప్తి
పిల్లలను పంపేందుకు నిరాసక్తత
చంద్రపాలెం పాఠశాలలో 4,165 మంది విద్యార్థులకుగాను కేవలం 320 మంది హాజరు
తోటగరువు పాఠశాలలో 2,177కి 198 మంది రాక
వచ్చిన విద్యార్థులు కూడా భయంభయంగా ఉంటున్నారంటున్న ఉపాధ్యాయులు
చోడవరం హైస్కూల్లో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా లక్షణాలు
విశాఖపట్నం/చోడవరం, జనవరి 17:
కొవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం పాఠశాలలను తెరవాలని తీసుకున్న నిర్ణయం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన రేపుతున్నది. సోమవారం పాఠశాలలు తెరిచినప్పటికీ, విద్యార్థుల హాజరు అంతంతమాత్రంగానే ఉంది. కొవిడ్ విజృంభిస్తుంటే ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ఇవ్వకుండా తెరవడాన్ని విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు కూడా తప్పుబడుతున్నారు. పాఠశాలకు హాజరైన విద్యార్థులు కూడా భయం భయంగా వుంటున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు. చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సగం కంటే తక్కువగానే హాజరయ్యారు. పాఠశాలలో 436 మందికి విద్యార్థులకుగాను సోమవారం కేవలం 104 మంది మాత్రమే హాజరయ్యారు.
ఇద్దరు ఉపాధ్యాయుల్లో కరోనా లక్షణాలు
ఇదిలావుంటే సోమవారం చోడవరం హైస్కూల్కు హాజరైన ఉపాధ్యాయులలో ఇద్దరికి కొవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షల నిమిత్తం బుచ్చెయ్యపేట మండలం వడ్డాది ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. దీంతో ఇటు సహచార ఉపాధ్యాయులతో పాటు, విద్యార్థులలో ఆందోళన పెరిగింది.
- మధురవాడలోని చంద్రంపాలెం జడ్పీ హైస్కూల్లో మొత్తం 4,165 మంది విద్యార్థులు చదువుతుండగా సోమవారం కేవలం 320 మంది మాత్రమే హాజరయ్యారు.
- భీమిలిలోని జీవీఎంసీ సెంట్రల్ హైస్కూల్లో 220 మంది విద్యార్థులకుగాను 17 మంది, పండిట్ నెహ్రూ జీవీఎంసీ హైస్కూల్లో 340 మందికిగాను 63 మందే హాజరయ్యారు.
- నగరంలోని పెదగదిలి జంక్షన్కు సమీపంలో వున్న తోటగరువు జడ్పీ ఉన్నత పాఠశాలలో మొత్తం 2,177 మంది విద్యార్థులకుగాను 198 మంది మాత్రమే హాజరయ్యారు.
- వేపగుంట హైస్కూల్లో 800 మంది విద్యార్థులకు గాను 151 మంది మాత్రమే హాజరైనట్టు హెచ్ఎం పద్మావతి తెలిపారు.
- పరవాడ బాలుర ఉన్నత పాఠశాలలో 444 మందికి గాను 67 మంది, బాలికోన్నత పాఠశాలలో 358కి 100 మంది, తానాం హైస్కూల్లో 251 మందికి 49 మంది హాజరయ్యారు.
- సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 570కి 175, మలునాయుడుపాలెం జడ్పీ హైస్కూల్లో 265కి 85, నంగినారపాడు జడ్పీ హైస్కూల్లో 459కి 130, అయ్యన్నపాలెం ఎంపీయూపీ స్కూల్లో 62కి 20, తవ్వవానిపాలెం జడ్పీ హైస్కూల్లో 121కి 63 మంది హాజరయ్యారు.
- గోపాలపట్నం బాలికోన్నత పాఠశాలలో 1,100కి 150 మంది, గోపాలపట్నం బాలుర ఉన్నత పాఠశాలలో 1,000కి 200 మంది, ఎల్లపువానిపాలెం జడ్పీ హైస్కూల్లో 360కి 70, పద్మనాభనగర్ జడ్పీ హైస్కూల్లో 315కి 75 మంది హాజరయ్యారు.
- పాయకరావుపేట మండలంలో 57 పాఠశాలల్లో 8,400 మంది చదువుతుండగా, సోమవారం కేవలం 563 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు.
- నక్కపల్లి మండలంలో మొత్తం 73 పాఠశాలల్లో 9,763 మందికి కేవలం 2,393 మంది మాత్రమే విచ్చేశారు.
- ఎస్.రాయవరం మండలంలో మొత్తం 65 ప్రభుత్వ పాఠశాలల్లో 9,450 మంది ఉండగా, 4,312 మంది హాజరయ్యారు.
- కోటవురట్ల మండలంలో 50 పాఠశాలల్లో, 5,318 మంది చదువుతుండగా 2,248 మంది వచ్చారు.
- ఎలమంచిలి మండలంలోని 51 పాఠశాలల్లో 4,586 మందికి 1,685 మంది విచ్చేశారు.
- రాంబిల్లి మండలంలోని 57 పాఠశాలల్లో 4,831 మందికి 1,779 మంది హాజరయ్యారు.
- మునగపాక మండలంలో 50 పాఠశాలలు ఉండగా, యాభై శాతం మంది మాత్రమే విద్యార్థులు హాజరయ్యారు.
- నాతవరం మండలంలో 65 పాఠశాలల్లో 5,948 మంది చదువుతుండగా, అరవై శాతం మంది హాజరయ్యారు.
- అనకాపల్లి పట్టణం, మండలంలో 86 ప్రభుత్వ పాఠశాలల్లో 14 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో సోమవారం 10,500 మంది హాజరయ్యారు.
- కశింకోట మండలంలో 42 పాఠశాలల్లో 6,598 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో సోమవారం 2,806 మంది మాత్రమే హాజరయ్యారు.