మృతదేహంతో మూడు రోజులుగా.. చెల్లెలి శవంతో ఇంట్లోనే అక్క!

ABN , First Publish Date - 2022-01-18T09:23:21+05:30 IST

స్వాతి, శ్వేత.. ఈ ఇద్దరూ అక్కాచెల్లెల్లు. పదేళ్ల క్రితం అమ్మ చనిపోయింది. ఆలనా పాలనా చూడాల్సిన నాన్న..

మృతదేహంతో మూడు రోజులుగా.. చెల్లెలి శవంతో ఇంట్లోనే అక్క!

పెద్దపల్లి, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): స్వాతి, శ్వేత.. ఈ ఇద్దరూ అక్కాచెల్లెల్లు. పదేళ్ల క్రితం అమ్మ చనిపోయింది. ఆలనా పాలనా చూడాల్సిన నాన్న.. బాధ్యతలు వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. కష్టకాలంలో అన్నీ తామై అండగా నిలిచిన అమ్మమ్మ, తాతయ్యలూ ఇటీవలే మరణించారు. దీంతో.. ఆ ఇద్దరూ మానసికంగా కుంగిపోయారు. ఈ క్రమంలో.. చెల్లెలు మారోజు శ్వేత (24) ఆరోగ్యం క్షీణించింది. ఆర్థిక ఇబ్బందులతో ఆస్పత్రికి కూడా వెళ్లలేని స్థితిలో.. శనివారం మరణించింది. దీంతో.. మరింత షాక్‌కు గురైన అక్క స్వాతి.. ఏం చేయాలో పాలుపోక.. ఎవరికీ చెప్పుకోక.. అలాగే ఉండిపోయింది. మూడు రోజులుగా.. చెల్లెలి మృతదేహంతో.. ఇంట్లోనే ఉండిపోయింది. ఆ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో.. సోమవారం చుట్టుపక్కల వాళ్లు లోపలికి వెళ్లి చూసి పోలీసులకు సమాచారం అందించారు. 


పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పెద్దపల్లిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చిం ది. అమ్మమ్మ, తాతయ్యలు మరణించిన తర్వాత.. అక్కాచెల్లెళ్లు ఎవరితోనూ కలిసే వారు కాదని, చుట్టుపక్కల వారితో కూడా మాట్లాడేవారు కాదని స్థానికులు చెబుతున్నారు. కాగా, చెల్లెలు శ్వేత ఎంసీఏ చదవగా.. అక్క స్వాతి ఎంటెక్‌ పూర్తి చేసి ఓ ప్రైవేట్‌ కళాశాలలో టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. 

Updated Date - 2022-01-18T09:23:21+05:30 IST