మూడు జిల్లాలకు Red alert

ABN , First Publish Date - 2021-11-26T12:42:42+05:30 IST

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాతావరణ కేంద్రం తిరునల్వేలి, తెన్‌కాశి, తూత్తుకుడి జిల్లాలకు ‘రెడ్‌ అలర్ట్‌’ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా అనేక

మూడు జిల్లాలకు Red alert

- తూత్తుకుడిలో 25 సెం.మీ వర్షపాతం 

- 6 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు 


అడయార్‌(చెన్నై): రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాతావరణ కేంద్రం తిరునల్వేలి, తెన్‌కాశి, తూత్తుకుడి జిల్లాలకు ‘రెడ్‌ అలర్ట్‌’ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా గురువారం మధ్యాహ్నం నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షం పడింది. ప్రధానంగా తిరునల్వేలి, పుదుకోట, విల్లుపురం, రామనాథపురం, తూత్తుకుడి, శివగంగై, మదురై జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు తదితర జిల్లాల్లోనూ గురువారం ఓ మోస్తరు వర్షం కురసింది. అయితే, శుక్రవారం పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం వుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా దిండుగల్‌, అరియలూరు, విరుదునగర్‌, తిరునల్వేలి, తూత్తుకుడి, పుదుకోట జిల్లాల్లో అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించడంతో శుక్రవారం పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీచేశారు. జాలర్లు కూడా సముద్రంలోకి చేపలవేటకు వెళ్ళొద్దని సూచించారు. కాగా, తూత్తుకుడి జిల్లాలో గురువారం సాయంత్రానికి 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 


29 తరువాత అల్పపీడన ద్రోణి బలపడే అవకాశం

ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో కేంద్రీకృతమైన అల్పపీడన ద్రోణి స్థిరంగా ఉంది. నిజానికి ఈ ద్రోణి మరింతగా బలపడి వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు దిశగా ప్రయాణిస్తుందని తొలుత అంచనావేశారు. కానీ, గాలివేగం దిశ మారడంతో ఈ అల్పపీడనం అక్కడే స్థిరంగా కొనసాగుతోందని, ఈ నెల 29వ తేదీన బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. అయినప్పటికీ వచ్చే రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మరింత బలంగా తయారయ్యాయి. వీటికితోడు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన బాహ్య ఉపరితల ఆవర్తన ద్రోణి నైరుతి దిశగా పయనించి గురువారం అల్పపీడనంగా మారుతుందని భావించారు. అయితే, నైరుతి దిశలో వీస్తున్న గాలుల వేగం మందగించడం, ఉత్తర భారతదేశం నుంచి బంగాళాఖాతం వైపు వచ్చే చలిగాలుల కారణంగా శ్రీలంకకు సమీపంలోని కేంద్రీకృతమైన అల్పపీడన ద్రోణి బలపడకుండా స్థిరంగా కొనసాగుతోంది. గాలివేగం దిశ మారడం వల్ల ఒక వేళ ఇది శ్రీలంక, పుదుకోట, కన్నియాకుమారి మీదుగా అరేబియా సముద్రం వైపు వెళ్ళవచ్చని భావిస్తున్నారు. ఈ కారణంగా గురువారం రామనాథపురం, పుదుకోట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఇదికాకుండా, కన్నియకుమారి, కడలూరు, విల్లుపురం డెల్టా జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. ఉత్తర కోస్తా జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో తేలికపాటి వర్షపు జల్లులు పడ్డాయి. అలాగే, శుక్రవారం కూడా తూత్తుకుడి, రామనాథపురం, కడలూరు జిల్లాలు, కారైక్కాల్‌ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుంది. చెన్నైలో ఆకాశం మేఘావృతమై కనిపించనుంది. రాత్రి సమయాల్లో వర్షపు జల్లులు పడే అవకాశం ఉంది. శ్రీలంకకు సమీపంలో ఉన్న ఈ అల్పపీడన ద్రోణి వచ్చే 48 గంటల్లో వాయుగుండంగా మారి వాయువ్య దిశగా పయనించి అరేబియా సముంద్రం ప్రాంతంలో తీరాన్ని దొటవచ్చని భావిస్తున్నారు. ఈ కారణంగా ఉత్తర తమిళనాడు, కోస్తాతీర జిల్లాలు, డెల్టా జిల్లాల్లో ఈ నెల 29వ తేదీన భారీ వర్షం పడే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. 

Updated Date - 2021-11-26T12:42:42+05:30 IST