మూడు గంటలు ఆరుబయటే విధులు
ABN , First Publish Date - 2021-10-27T06:47:16+05:30 IST
నెల రోజులుగా నేరేడుచర్ల మునిసిపాలిటీ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కొండముచ్చు ఎట్టకేలకు మంగళవారం చిక్కింది.
కొద్దిరోజులుగా నేరేడుచర్ల ప్రజలపై కొండముచ్చు దాడి
మునిసిపాలిటీ కార్యాలయంలోకి దూరడంతో పట్టివేత
ఊపిరిపీల్చుకున్న స్థానికులు
నేరేడుచర్ల, అక్టోబరు 26: నెల రోజులుగా నేరేడుచర్ల మునిసిపాలిటీ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కొండముచ్చు ఎట్టకేలకు మంగళవారం చిక్కింది. ప్రతి రోజూ ప్రజలపై దాడులు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తుండటంతో దానిని పట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా నుంచి నిపుణులు పిలిపించారు. వారు బంధించేందుకు ప్రయత్నించే క్రమంలో మునిసిపాలిటీ కార్యాలయంలోకి దూరింది. దీంతో కార్యాలయం సిబ్బంది సుమారు మూడు గంటల పాటు ఆరుబయటే విధులు నిర్వహించాల్సి వచ్చింది. మొదట బోన్లు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోవడంతో వలల సాయంతో చాకచక్యంగా బంధించారు. బందీగా ఉన్న కొండముచ్చును చూసేందుకు పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొండముచ్చును అటవీ ప్రాంతంలో వదిలి వేస్తారని మునిసిపాలిటీ కమిషనర్ గోపయ్య తెలిపారు. ఎట్టకేలకు కొండముచ్చును పట్టుకోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.