America లో ముగ్గురు భారతీయుల అరెస్ట్.. దోషిగా తేలితే పదేళ్ల జైలు.. ఇంతకు వారు చేసిన నేరమేంటంటే..

ABN , First Publish Date - 2021-12-04T18:56:51+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ముగ్గురు భారతీయులను అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన నేరం కింద బార్డర్ సెక్యూరిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

America లో ముగ్గురు భారతీయుల అరెస్ట్.. దోషిగా తేలితే పదేళ్ల జైలు.. ఇంతకు వారు చేసిన నేరమేంటంటే..

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ముగ్గురు భారతీయులను అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన నేరం కింద బార్డర్ సెక్యూరిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. క్రిష్ణబెన్ పటేల్(25), నికుంజ్ కుమార్ పటేల్(27), అశోక్ కుమార్ పటేల్(39) అనే ముగ్గురిని యూఎస్ వర్జిన్ ఐస్‌ల్యాండ్‌లోని సెయింట్ క్రోయిక్స్ విమానాశ్రయంలో నవంబర్ 24న అరెస్ట్ చేశారు. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్‌కు వెళ్లేందుకు వచ్చిన వీరిని సెక్యూరిటీ తనిఖీల్లో భాగంగా సరియైన ధృవపత్రాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ సమయంలో ఈ ముగ్గురు అక్రమంగా దేశంలోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం ఈ నెల 2వ తేదీన వారిని ప్రాథమిక విచారణ నిమిత్తం సెయింట్ క్రోయిక్స్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.


న్యాయస్థానంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. క్రిష్ణబెన్ పటేల్, నికుంజ్ కుమార్ పటేల్, అశోక్ కుమార్ పటేల్‌ నవంబర్ 24న ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్‌కు వెళ్లేందుకు యూఎస్ వర్జిన్ ఐస్‌ల్యాండ్‌లోని సెయింట్ క్రోయిక్స్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఆ సమయంలో సాధారణ సోదాల్లో భాగంగా వారి వద్ద సరియైన ధృవపత్రాలు లేకపోవడం అక్కడి అధికారులు గుర్తించారు. దాంతో అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ సమయంలో వారి వద్ద తప్పుడు మార్గంలో పొందిన ఫ్లోరిడా డ్రైవర్స్ లైసెన్స్ దొరికింది. అంతేగాక ఈ ముగ్గురు 2019లో కాలిఫోర్నియాలోని టెకేట్‌లో కూడా ఇలాగే అక్రమ మార్గంలో దేశంలోకి ప్రవేశించినందుకు అరెస్ట్ అయ్యారు. దాంతో వారిని అదే ఏడాది దేశం నుంచి బహిష్కరించారు. ఇప్పుడు మరోసారి అధికారుల కళ్లుగప్పి తప్పుడు ధృవపత్రాలతో అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని అధికారుల విచారణలో తేలింది. దీంతో డిసెంబర్ 2న వారిని ప్రాథమిక విచారణ కోసం సెయింట్ క్రోయిక్స్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. విచారణలో భాగంగా కోర్టు జడ్జి జార్జ్ డబ్ల్యూ కెనాన్ ముందు అధికారులు ఈ ముగ్గురి వివరాలతో పాటు వారి పాత నేరాన్ని కూడా వివరించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ దశలో ఉంది. ఒకవేళ ఈ కేసులో వారు దోషిగా తేలితే మాత్రం పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే శిక్షకాలం పూర్తైన వెంటనే దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుంది. 

Updated Date - 2021-12-04T18:56:51+05:30 IST