బ్రిటన్‌లో ముగ్గురు భారతీయ సోదరులకు జీవిత ఖైదు!

ABN , First Publish Date - 2021-05-01T18:53:38+05:30 IST

22 ఏళ్ల యువకుడి హత్య కేసులో దోషిగా తేలిన ముగ్గురు భారతీయ సోదరులకు బ్రిటన్ కోర్టు గురువారం జీవిత ఖైదు విధించింది.

బ్రిటన్‌లో ముగ్గురు భారతీయ సోదరులకు జీవిత ఖైదు!

లండన్: 22 ఏళ్ల యువకుడి హత్య కేసులో దోషిగా తేలిన ముగ్గురు భారతీయ సోదరులకు బ్రిటన్ కోర్టు గురువారం జీవిత ఖైదు విధించింది. వివరాల్లోకి వెళ్తే.. వెస్ట్ లండన్‌లోని ఆక్టన్‌లో 2019 సెప్టెంబర్ 24న భారత్‌కు చెందిన ముగ్గురు పంజాబీ సోదరులు కమల్ సోహల్(23), సుఖ్మీందర్ సోహల్(25), మైఖేల్ సోహల్(28).. స్థానికంగా ఉండే ఓస్వాల్డో డి కార్వాల్హో(22) మధ్య చిన్న విషయమై ఘర్షణ చోటు చేసుకుంది. ఓస్వాల్డోపై ముగ్గురు సోదరులు చేయి చేసుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో ముగ్గురు సోదరులపై హత్య కేసు నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 16న దక్షిణ లండన్‌లోని క్రోయిడాన్ క్రౌన్ కోర్టులో ఈ కేసు విచారణకు రాగా.. ముగ్గురు పంజాబీ సోదరులను న్యాయస్థానం దోషిగా తేల్చింది. గురువారం సోహల్ సోదరులకు బ్రిటన్ కోర్టు శిక్షను ఖరారు చేసింది. ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. వీరిలో కమల్ సోహల్ కనీసం 22 ఏళ్లు జైలులో ఉండాల్సి ఉంటే.. మైఖేల్ సోహల్ 19 ఏళ్లు జైలు జీవితం గడపాల్సి ఉంటుందని న్యాయస్థానం వెల్లడించింది. అలాగే ఇదే కేసులో నాల్గో దోషి అయిన ఆంటోనీ జార్జ్(24) అనే యువకుడికి కోర్టు తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది.     


Updated Date - 2021-05-01T18:53:38+05:30 IST